Saleshwaram Jatara: తెలంగాణ అమర్నాథ్ యాత్ర వచ్చేసిందోచ్.. నల్లమల అడవుల గుండెల్లో, పచ్చని ప్రకృతి ఒడిలో కొలువుదీరిన పరమశివుడిని దర్శించుకోవడమంటే అది కేవలం భక్తి యాత్ర మాత్రమే కాదు.. ప్రాణాలకు తెగించి చేసే ఒక మహా సాహసం. ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి వేళ (ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి 6 వరకు) నిర్వహించే ఈ జాతర కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. దట్టమైన అరణ్యం, జాలువారే జలపాతాలు, లోతైన లోయల మధ్య సాగే ఈ యాత్రను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ వెలసిన లింగమయ్యకు చెంచులే పూజారులుగా వ్యవహరించడం శతాబ్దాలుగా వస్తున్న ఒక గొప్ప సంప్రదాయం.
అరణ్య మార్గంలో ఆధ్యాత్మిక అడుగులు
ఈ యాత్ర నాగర్కర్నూల్ జిల్లా అమ్రబాద్ అటవీ ప్రాంతంలో ఉంటుంది. అయితే అమ్రబాద్ నుంచి శ్రీశైలం వెళుతుంటే.. అక్కడి నల్లమల్ల ఫారెస్ట్లోని పులిబొమ్మ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరం అడవి మార్గంలో ప్రయాణించి బేస్ క్యాంపు చేరుకోవాలి. దారి పొడవునా పులులు, చిరుతలు వంటి వన్యమృగాల సంచారం ఉన్నప్పటికీ, శివనామ స్మరణతో భక్తులు ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగుతారు. వెళ్లేటప్పుడు గాలిలో ప్రతిధ్వనించే “వస్తున్నాం లింగమయ్యా” అనే నినాదాలు భక్తులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలాగే అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా “వెళ్లోస్తాం లింగమయ్య” అంటూ నామస్మరణ చేస్తారు. అయితే అక్కడ నిజాం కాలం నాటి పురాతన కట్టడాలు, అటవీ సౌందర్యం ఈ ప్రయాణంలో కనువిందు చేస్తాయి.
శ్వాస నిలిపే సాహస యాత్ర
రాంపూర్ చెంచుపెంట వద్ద వాహనాలు నిలిపివేసిన తర్వాత అసలైన సాహసం మొదలవుతుంది. సుమారు 4 కిలోమీటర్ల మేర కాలి నడకన లోయలోకి దిగాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల దారి కేవలం ఒక్క అడుగు వెడల్పు మాత్రమే ఉంటుంది. అడుగు తప్పితే అగాధమే అన్నట్లుండే ఈ మార్గంలో భక్తులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగుతారు. మోకాల చెరువు, మైసమ్మకట్ట వంటి ప్రాంతాలను దాటుకుంటూ, నిట్టనిలువుగా ఉండే కొండల మధ్య నుంచి సాగే ఈ నడక భక్తుల సహనానికి, భక్తికి పరీక్షగా నిలుస్తుంది.
వెండి జలపాతం.. ఔషధ గుండం
లోయ అడుగుభాగానికి చేరుకోగానే సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం భక్తుల అలసటను ఇట్టే మాయం చేస్తుంది. ఈ నీరు అనేక వనమూలికల గుండా ప్రవహిస్తూ రావడం వల్ల దీనికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థాన్ని సేవించడమే కాకుండా, పవిత్రంగా భావించి ఇళ్లకు కూడా తీసుకెళ్తుంటారు. ఆ చల్లని నీటి ధారల కింద స్నానం చేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ పునీతమవుతాయని భక్తులు విశ్వసిస్తారు.
గుహల్లో కొలువుదీరిన పరమశివుడు
సలేశ్వరం క్షేత్రంలో స్వామివారు ఒకరిపై ఒకరు ఉన్న రెండు సహజసిద్ధమైన గుహల్లో దర్శనమిస్తారు. పై గుహలో ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి కొలువుదీరగా, కింది గుహలో మరొక లింగం ఉంటుంది. ఆలయం ముందు గంగమ్మ, వీరభద్రుడి విగ్రహాలు భక్తులను ఆశీర్వదిస్తాయి. ఇక్కడ ఎటువంటి ఆడంబరాలు ఉండవు, కేవలం భక్తి, ప్రకృతి మాత్రమే ఉంటాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు అడవి మధ్యలో తాగునీరు, ఆహార సౌకర్యాలను కల్పించడం విశేషం.
Also Read: శ్రీ రామనవమికి ముస్తాబవుతున్న రామ మందిరాలు.. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు.
భక్తుల సౌకర్యార్థం రవాణా ఏర్పాట్లు
ఈ మహా జాతరను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని ఎంజీబీఎస్ నుంచి, అలాగే నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అటవీ ప్రాంతం కాబట్టి పర్యావరణాన్ని కాపాడటం భక్తుల బాధ్యత. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ, ప్రకృతికి హాని కలగకుండా ఈ యాత్రను పూర్తి చేయడం ప్రతి భక్తుడి కర్తవ్యం.