Tirumala Seva Volunteer: తిరుమలలో శ్రీవారి దగ్గర సేవ చేయాలని ఉందా..? స్వచ్చందంగా ఆ ఏడుకొండల సన్నిధిలో గడపాలని ఉందా..? అయితే శ్రీవారి సేవకులుగా మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అయితే అందుకోసం ముందుగానే మీరు ఆన్లైన్ లో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి సేవకులుగా చేయాలంటే ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కలగడం అంటే జన్మజన్మల పుణ్యమనే చెప్పుకోవచ్చు అలాంటి సేవ చేయాలనుకునే వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అవకాశం కల్పిస్తుంది. అయితే అందుకు సంబంధించిన విధివిధానాలను బోర్డు అధికారులు తెలియజేశారు.
శ్రీవారి సేవ స్వచ్ఛంద సేవ. ఇది యాత్రికులకు సహాయం నిమిత్తం ఏర్పాటు చేయడమైనది. ఎవ్వరికి ధనరూపంగా, వస్తురూపంగా ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. శ్రీవారి సేవ పూర్తిగా ఉచితం. శ్రీవారి సేవకులుగా హిందువులను మాత్రమే అనుమతిస్తారు. శ్రీవారి సేవకుల వయస్సు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. సేవ చేయాలనుకునే వాళ్లు టీమ్ గా అయినా రావొచ్చు ఒక్కరిగా అయినా రావొచ్చు. టీమ్ గా రావాలనుకున్న వాళ్లు కచ్చితంగా టీమ్లో 10 నుంచి 15 మంది ఉండేలా చూసుకోవాలి. శ్రీవారి సేవకులకు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. శ్రీవారి సేవకులందరూ తప్పనిసరిగా తిరునామం, తిలకం, కుంకుమ లేక చందనం బొట్లు స్పష్టంగా కనిపించేట్లు ధరించాలి. సేవా ఆఫీసువారు ఇచ్చిన స్కార్ఫులను, ఐ.డి. కార్డు కవరు, ట్యాగ్లను సేవల అనంతరం సేవా ఆఫీసు వారికి తిరిగి అప్పగించవలెను.
సేవాసదన్ నందు నమోదు చేసుకొన్న తరువాత తిరుమలలో టి.టి.డి. వారు ఇచ్చిన వసతి సముదాయంలోనే ఉండాలి. మీకు ఇచ్చిన సేవలను పూర్తిగా నిర్వహించాలి. ఏడు రోజుల సేవా సమయంలో మధ్యలో తిరుమల వదిలి వెళ్లకూడదు. మహిళా సేవకులు, పురుష సేవకులకు విడి విడిగా వసతి ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చిన వసతి సముదాయంలోనే ఉండాలి. సేవా సమయము నందు సేవకులు ‘గోవిందా’ అని నామస్మరణ ప్రేమతో, భక్తితో చేయుచూ సేవలను నిరాడంబరముగా, పవిత్రముగా చేయవలెను. శ్రీవారి సేవకులు భక్తులతో గొడవ చేయరాదు.
శ్రీవారి ఆలయములలో సేవలు ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు కేటాయింపబడును. టీమ్ లీడర్ల సెల్ఫోన్లకు మెసేజ్ వచ్చును. ఆఫీస్ నోటీస్ బోర్డుల నందు లిస్ట్ అతికించబడును. ఇది 7 రోజులు సేవ చేయు శ్రీవారి సేవకులకు మాత్రమే. ప్రతిరోజూ సేవా సదన్ హాలు 1 వ అంతస్తు నందు సత్సంగము, భజన ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు జరిగే భజనలో.. ఉదయం సేవలో ఉన్నవారు సాయంత్రం, సాయంత్రం సేవలో ఉన్నవారు ఉదయం పాల్గొన్నాలి. ఈ భజన కార్యక్రమానికి ప్రతి టీమ్ లీడరు వారి శ్రీవారి సేవకులు అందరూ తప్పనిసరిగా పాల్గొన్నాలి. సత్సంగమునకు హాజరు కాని సేవకులకు శ్రీవారి ఆలయములలో సేవలు ఇవ్వబడవు. శ్రీవారి సేవకులకు లక్కీడిప్ అర్జిత సేవల టికెట్లు ఇవ్వబడవు.
పురుషులు తెలుపు రంగు వస్త్రాలు, స్త్రీలు మెరూన్ బార్డర్తో కూడిన ఆరెంజ్ కలర్ చీర మరియు వి-నెక్ కలిగిన మెరూన్ కలర్ రవిక ధరించవలెను. శ్రీవారి సేవకులు నిర్ణయించిన డ్యూటీ తేదీలు పూర్తి అయిన తరువాత మాత్రమే శ్రీవారి దర్శనం.
శ్రీవారి సేవకు వచ్చుటకు ఆసక్తిగలవారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం www.srivariseva.tirumala.org అనే వెబ్సైట్ లోకి వెళ్లి మీ టీం కానీ ఒక్కరు కానీ నమోదు చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.