Big Stories

Temple Rulers : ఆలయానికి క్షేత్రపాలకులు ఎందుకుంటారు…?

Temple Rulers

Temple Rulers : సాధారణంగా క్షేత్రపాలకుడంటే శివుడే అని శైవాగమాలు చెప్తున్నాయి. వైష్ణవాగమాల్లో కూడా దండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు. శివాలయంలో ముఖ్యదేవతగా ఉంటాడు. శివాలయంలో ఆగ్నేయదిక్కున ఈ స్వామి ఆలయం ఉంటుంది. భక్తులు ముందుగా ఈయనను దర్శించి శివ దర్శనం.. శివార్చన కొరకు అనుమతి పొందిన తరువాతే ఆలయంలోకి అడుగుపెట్టాలనే నియమం కూడా ఉంది. ఈ నియమం భక్తులకే కాక అర్చనాది కైంకర్యాలు జరిపే అర్చకులకు కూడా ఉంది. ముఖ్యంగా అర్చకులు శివాలయానికి వేసిన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వద్దే ఉంచి వెళ్తారు. ఉదయాన్నే ఆలయం తెరిచే ముందు క్షేత్రపాలకుడి అనుమతి తీసుకొని అర్చనాది కార్యక్రమాలు మొదలుపెడతారు.

- Advertisement -

క్షేత్రపాలకుడు నల్లని మబ్బులవంటి శరీరవర్ణంతో.. గుండ్రటి కన్నులతో.. నగ్నంగా.. పదునైన పళ్లకోరలతో.. భ్రుకుటిని ముడిచి.. ఎర్రటి పొడవైన కేశాలతో.. శరీరంపై కపాలమాలలతో.. చేతుల్లో త్రిశూలం, కపాలం వంటి ఆయుధాలతో నిలుచుని.. భైరవవాహనంతో ఉంటాడు. కశ్యప శిల్పశాస్త్రం ప్రకారం చేతులు, ధరించే ఆయుధాలను బట్టీ సాత్త్విక, రాజస, తామస మూర్తులుగా విభజించింది.

- Advertisement -

తెల్లగా.. శాంతముఖంతో.. నాలుగు చేతులతో.. అభయ–వరదముద్రలతో.. రెండు ఆయుధాలతో ఉన్న స్వామి సాత్త్విక క్షేత్రపాలకుడు.
ఎర్రగా..ఉగ్రముఖంతో ఆరు చేతుల్లో ఆయుధాలు పట్టిన మూర్తి రాజసిక క్షేత్రపాలకుడు. నల్లగా.. తీక్షణంగా చూస్తూ.. మూడు కన్నులతో.. నాగాభరణాలతో.. ఎనిమిది చేతులతో తామసిక క్షేత్రపాలకుడు ఉంటాడు.

క్షేత్రపాలకుడు ఆలయానికి.. గ్రామానికి.. క్షేత్రానికి ముఖ్యమైన దేవుడనీ.. తొలుత ఆయన్నే పూజించాలని శాస్త్రోక్తి. కొన్ని స్థలమాహాత్మ్యాల్లో మాత్రం శివక్షేత్రానికి విష్ణువు.. విష్ణుక్షేత్రాలలో శివుడు క్షేత్రపాలకులని ఉంది. తిరుమల ఆలయంలో ఈశాన్యంలో క్షేత్రపాలక రుద్రశిల ఉంది. అలాగే గోగర్భం జలాశయం వద్ద ఉన్న ఒక పెద్ద రుద్రశిలను భక్తులు దర్శిస్తారు.

పంచారామ క్షేత్రాలన్నింటికీ విష్ణువు క్షేత్రపాలకుడై ఉన్నాడు. భద్రాచలం లాంటి కొన్ని నృసింహ క్షేత్రాలకు ఆంజనేయస్వామి, శ్రీశైలానికి వీరభద్రుడు, బద్రీనాథ్‌ క్షేత్రానికి ఘంటాకర్ణుడు, వారణాసి, శ్రీకాళహస్తి, ఉజ్జయిని క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులు. క్షేత్రపాలకుడి దర్శనం, పూజ విశేష ఫలితాలిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News