Hyderabad Hospital Fraud: హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ పెట్టుబడుల మోసం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి ఈక్విటీ పేరుతో తోటి వైద్యుల నుంచి కోట్లాది రూపాయల నిధులను సేకరించి, ఆపై వంచన చేసినట్లు ఆరోపిస్తూ ఆసుపత్రి మాజీ ఎండీ వేణుగోపాల్ కాకుంట్ల, అతని సోదరుడు హేమంత్ కాకుంట్లపై సీసీఎస్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్లాస్టిక్ సర్జన్ డా. చొక్కా రాజేష్ వాసుతో పాటు మరో 13 మంది సీనియర్ డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2014-15 మధ్య కాలంలో నిందితులు ఆసుపత్రి విస్తరణ, ఈక్విటీ వాటాల పేరుతో వారిని నమ్మించారు. పారదర్శకమైన, వైద్యుల నియంత్రణలో ఉండే ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చి సుమారు ₹100 కోట్ల వరకు నిధులను సమీకరించారు. ఇందులో ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల వాటానే ₹38 కోట్లకు పైగా ఉంది.
ఆసుపత్రిలో రోగుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఏటా ₹10 నుండి ₹20 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు కృత్రిమ లెక్కలు చూపి బాధితులను తప్పుదోవ పట్టించారు. ఆసుపత్రికి వచ్చిన ఆదాయాన్ని నిందితులు తమ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మరియు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు మళ్లించారని డాక్టర్లు ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రోగుల నుంచి ఒక్కొక్కరికి ₹10 నుండి ₹20 లక్షల వరకు భారీ బిల్లులు వసూలు చేశారని, కానీ రికార్డుల్లో మాత్రం తక్కువ మొత్తాలను చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రికి సమీపంలోని ఒక జ్యువెలరీ షాపు ద్వారా నగదు లావాదేవీలను సాగిస్తూ ఆసుపత్రి రెవెన్యూను తక్కువ చేసి చూపినట్లు బాధితులు వెల్లడించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు నిందితులు వేణుగోపాల్ మరియు హేమంత్లపై IPC సెక్షన్లు 406 (నమ్మకద్రోహం), 409, 477-A (లెక్కల తారుమారు), 120-B (నేరపూరిత కుట్ర) కింద కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే మరిన్ని ఆధారాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ కీలక తీర్పు!