“No Modi Wave” Said by Navneet Kaur: సినీ నటి, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశంలో మోదీ వేవ్ లేదని ఇటీవల ఆమె ఓ సభలో ప్రసంగించారంటూ.. వీడియోలు వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్థిగా నవనీత్ బరిలో దిగారు. అయితే సోమవారం అమరావతిలో నిర్వహించిన ఓ సభలో ఆమె మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోరాటం సాగించాలని ప్రజలకు సూచించారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాలని అన్నారు. 2019లో కూడా మోదీ వేవ్ ఉందన్న ఆమె.. అయినప్పటికీ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని తెలిపారు. కాగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది నవనీత్ కౌర్. అయితే నటిగా అందరికి సుపరిచితమైన నవనీత్ కౌర్ మహారాష్ట్ర బీజేపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె భారీ విజయం సాధించారు. అప్పటి నుంచి పలు సందర్భాల్లో ఆమె బీజేపీకి మద్దతుగా నిలిచారు. దీంతో ఆమెకు పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందని అంతా భావించగా.. అనుకున్నట్లుగానే అధిష్టానం ఆమెకు టికెట్ కేటాయించింది.
ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ కావడంతో ఈ అంశంపై శరద్ పవార్ మాట్లాడారు. విజయంపై బీజేపీ వర్గాల్లో తీవ్ర భయాందోళన నెలకొందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని 48 సీట్లను విపక్ష కూటమి గెల్చుకుంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మోదీ పోటీ చేస్తున్న స్థానంలో కూడా విజయం సాధించడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశంలో బీజేపీ కేవలం 45 సీట్లు మాత్రమే గెలుస్తుందంటూ గతంలో తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థులే ఈ నిజాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారని తెలిపారు.
Also Read: CM Naveen contest two seats: రూటు మార్చిన నవీన్, ఈసారి టార్గెట్ వెస్ట్
ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలు వైరల్ కావడంపై నవనీత్ కౌర్ స్పంధించారు. కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మోదీ దేశంలో చేసిన అభివృద్ధి గురించి సభలో మాట్లాడానని అన్నారు. దేశంలో మోదీ వేవ్ ఎప్పటికీ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మోడీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తాను కూడా ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు.