CM Naveen patnaik contest two seats(Latest political news in India): నవీన్ పట్నాయక్.. పెద్దగా పరిచయం చేయనవసరం లేని వ్యక్తి. దాదాపు 25 ఏళ్ల పాటు ఒడిషా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అక్కడి ప్రజలు కూడా ఆయన్ని బాగా నమ్మారు. ప్రజల ఆశలను వమ్ము చేయలేదు కూడా. అందుకే దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు నవీన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే.. మామూలు విషయం కాదు. సింపుల్గా ఉంటూ ప్రజలతో మమేకమయ్యేవారు. ఈసారి ఎన్నికల్లోనూ గెలుపొందాలని ఆయన ఉవ్విల్లూరుతున్నారు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేస్తూ వెళ్తున్నారు.
సీఎం నవీన్ పట్నాయక్ను చూసి చాలా నేర్చుకోవాలని అంటుంటారు సీనియర్లు పొలిటీషియన్లు. 2000 ఏడాదిలో ఒడిషా సీఎంగా పగ్గాలు చేపట్టిన ఆయన.. వెనుదిరిగి చూడలేదు. అప్పటివరకు బలంగా ఉన్న కాంగ్రెస్ను ఢీ కొట్టి పగ్గాలు అందుకున్నారు. నవీన్ పగ్గాలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒడిషా అంటే నవీన్ పట్నాయక్.. నవీన్ అంటే ఒడిషా అనే విధంగా చేసుకుంటూ వచ్చారు. 25 ఏళ్లగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే అది ఆషామాషీ విషయం కాదు.
ఆంధ్రప్రదేశ్తోపాటు ఒడిషా శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీకి ఎక్కడైనా ఓడిపోతుందని తెలిస్తేచాలు సైలెంట్గా పావులు కదుపుతారు. ప్రత్యర్థులను తనవైపు తిప్పుకోవడం ఆయనకు తిరుగు లేదని అంటారు. అలాగని ఆయన వివాదాస్పద అంశాల జోలికి ఎప్పుడూ వెళ్లిన సందర్భాలు లేవు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మోదీ గాలి బలంగా వీస్తోంది. కమలం గాలిని ముందే పసిగట్టిన ఆయన.. తన వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తున్నారు.
గతంలో మాదిరిగానే ఈసారి సీఎం నవీన్ పట్నాయక్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. హింజిలి నియోజకవర్గం నవీన్ కంచుకోట. ఐదుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే వెస్ట్ ఒడిషాలో పార్టీ వీక్గా ఉన్న విషయం వేగుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడ బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తుందన్న సంకేతాలు రావడంతో అటువైపు కన్నేశారు సీఎం నవీన్. హింజిలితోపాటు కంటాబంజి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
ALSO READ: బీజేపీకి 150 సీట్లు కూడా రావు.. ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుంది..
వెస్ట్ ఒడిషాలో బీజేపీ నుంచి కీలక నేతలు లోక్సభ బరిలోకి దిగుతున్నారు. సంబల్పూర్ నుంచి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ పోటీ చేస్తున్నారు. బిజూ జనతాదళ్కు ఆయన గట్టి సవాల్ విసురుతున్నారు. అక్కడ ధర్మేంద్రకు ధీటుగా బలమైన వ్యక్తిని దించారు. అలాగే దేవ్గఢ్ రాణి అరుంధతీదేవిని దేవ్గఢ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. దీనికితోడు కంటాబంజి నుంచి సీఎం నవీన్ బరిలోకి దిగడంతో వెస్ట్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం నవీన్కు విధేయునిగా ఉన్న కీలక నేతలను ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దించారు. మొత్తానికి రాజకీయంగా ఎత్తుకు పైఎత్తులు వేయడంలో సీఎం నవీన్కు తిరుగులేదనే చెప్పాలి.