Vijay Deverakonda : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో పోలీసులు నిఘా పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మొదలుకొని పాన్ ఇండియా స్టార్లను సైతం వదలడం లేదు. సినిమాల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, ఆస్తులు కూడా వెనకేసుకున్న ఎంతోమంది హీరోలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని, వారిపై కేసుల నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను మొదలుకొని సెలబ్రిటీల వరకు దాదాపు 74 మందిని ఐడెంటిఫై చేయగా.. అందులో ఇప్పటికే 16 మందికి నోటీసులు జారీ చేశారు. అందులో ఇద్దరిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇంకొంత మంది సెలెబ్రెటీలకు విచారణకు రావాలని నోటీసులు కూడా జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు.
చిక్కుల్లో పడ్డ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్..
ఇదిలా ఉండగా.. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హీరో రాణా దగ్గుపాటి(Hero Rana Daggubati) ,ప్రకాష్ రాజ్ (Prakash Raj)తోపాటు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితోపాటు హీరోయిన్స్ మంచు లక్ష్మి (Manchu Lakshmi), నిధి అగర్వాల్(Nidhhi Agerwal), ప్రణీత (Praneetha) లపై కూడా కేసు నమోదు చేశారు. ఇక వీరే కాకుండా అనన్య నాగళ్ళ(Ananya Nagalla), సిరి హనుమంత్ (Siri Hanumanth), వంశీ సౌందర్య రాజన్, శ్రీముఖి(SriMukhi), వసంత కృష్ణ, శోభా శెట్టి(Shobha Shetty), అమృతా చౌదరి, నయని పావని, నేహా పతాన్ , పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ (Vishnu Priya), సాయి భయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల(Anchor Shyamala), టేస్టీ తేజ(Tasty Teja) బండారు శేష సుకృతి, రీతు చౌదరి (Rithu Chaudhary) తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక వీరంతా కూడా సినిమాల ద్వారా, బుల్లితెర సీరియల్స్ ద్వారా , పలు షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వారే కావడం గమనార్హం.
సెలబ్రిటీలపై నెటిజన్స్ ఫైర్..
ఇకపోతే ఇప్పుడు ఈ స్టార్ సెలబ్రిటీలందరిపై కూడా కేసు ఫైల్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అభిమాన హీరో, హీరోయిన్ అంటూ ఇక్కడ అభిమానులు కొట్టుకు చస్తుంటే.. మీరు మాత్రం డబ్బు దక్కించుకోవడానికి అభిమానుల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఒక హీరో ఏదైనా ఒక విషయాన్ని చెప్పారు అంటే ఇక దానినే అభిమానులు ఫాలో అవుతుంటారు. అలాంటి విషయాలను ఈ సెలబ్రిటీలు దృష్టిలో పెట్టుకోకుండా.. సొంత లాభం కోసం ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఎంతవరకు కరెక్ట్ అని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఒకసారి వీరిని శిక్షిస్తే ఇంకెవరైనా సరే ఇలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలంటేనే భయపడేలా చేయాలి అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.