Pushpa: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్పరాజ్ చేసిన సంచలనాల గురించి తెలిసిందే. సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) మాస్ తాండవానికి పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అయింది. “పుష్ప: ది రైజ్ – పార్ట్ 1” (Pushpa: The Rise – Part 1) డిసెంబర్ 17, 2021న తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, మరియు హిందీ భాషల్లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటించగా, రష్మికా మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇది మొదట ఒకే చిత్రంగా ప్లాన్ చేయబడినప్పటికీ, కథ విస్తరణ కారణంగా రెండు భాగాలుగా తెరకెక్కించాడు సుకుమార్. “పుష్ప: ది రైజ్” 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 350-400 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక గతేడాది రిలీజ్ అయిన ‘పుష్ప2: ది రూల్-పార్ట్ 2’ (Pushpa: The Rule – Part 2) ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఏకంగా 1871 కోట్లు కొల్లగొట్టింది. అయితే.. తాజాగా పుష్ప సినిమా గురించి సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ముందు.. పుష్ప సినిమా కాదు!
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుకుమార్.. పుష్ప సినిమా గురించి, ఆ టైటిల్ పెట్టడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. వాస్తవానికైతే.. సుకుమార్ మొదట “పుష్ప” కథను ఒక వెబ్ సిరీస్గా రూపొందించాలని అనుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనల ఆధారంగా సుకుమార్ దాదాపు ఆరు నెలల పాటు పరిశోధన చేశాడు. ఈ కథను తొలుత ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్గా తీర్చిదిద్దాలని భావించాడు. కానీ తర్వాత దాన్ని సినిమాగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని సుకుమార్ స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. “పుష్ప కథను వెబ్ సిరీస్ స్క్రిప్ట్గా రాస్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది. కానీ తర్వాత దీన్ని పెద్ద ఎత్తున సినిమాగా తీయాలని భావించాను” అని చెప్పాడు. దానికి కారణం బాహుబలి అని అన్నాడు. పుష్ప కథ పరిధి చాలా పెద్దది కావడంతో.. సిరీస్ చేయాలని అనుకున్న సుకుమార్.. బాహుబలి చూసిన తర్వాత సినిమాగా చేయడానికి డిసైడ్ అయ్యాడు. అంటే, ముందు సుకుమార్ అనుకున్న దాని ప్రకారం.. పుష్ప సినిమాగా కాదు, వెబ్ సిరీస్గా రావాల్సింది. ఇదే విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చాడు సుక్కు.
‘పుష్ప’ అసలు కథ ఇదే?
అలాగే.. పుష్ప సినిమాలో హీరో పాత్ర పేరు ‘పుష్ప’ అని ఎందుకు పెట్టారనే దాని గురించి సుకుమార్ చెబుతూ.. ఈ పాత్ర ఒక నిజమైన ఎర్రచందనం స్మగ్లర్ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. మొదట వెబ్ సిరీస్గా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు, ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి పరిశోధన చేస్తున్న సమయంలో.. పుష్పరాజ్ అనే స్మగ్లర్ను కలిశాను. అతన్ని కలిసిన తర్వాత.. అతని పేరు చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా అనిపించిందని పేర్కొన్నారు. జనరల్గా అయితే.. పుష్ప అనే పేరు స్త్రీలకు పెట్టే పేరుగా పరిగణించబడుతుంది. అయితే, ఒక స్మగ్లర్కు ఇలాంటి పేరు ఉండటం సుకుమార్ను ఆశ్చర్యపరిచిందని, అదే ఈ కథకు ప్రేరణగా నిలిచిందని ఆయన వివరించారు. ఇలా నిజ జీవిత స్మగ్లర్ పేరు మరియు అతని వ్యక్తిత్వం నుంచి స్ఫూర్తి తీసుకుని.. “పుష్ప” కథను సినిమాగా తీర్చిదిద్దినట్టుగా తెలిపారు. ఇక సుకుమార్ పుష్ప 3 కూడా ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.