Most Valuable Celebrities : బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ టాప్ బ్రాండ్ వాల్యూ సెలబ్రిటీగా నిలిచాడు. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యేయేషన్ స్టడీ పేరుతో కన్సల్టింగ్ సంస్థ క్రెల్ ఈ జాబితాను రూపొందించింది. 185.1 మిలియన్ డాలర్లతో రణ్వీర్ అందరికంటే టాప్ లో ఉన్నాడు. గతేడాది అగ్రస్థానంలో ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండోస్థానానికి పడిపోయాడు. టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టాప్ -25లో చోటు దక్కింది.
బ్రాండ్ ఎండార్స్మెంట్, ప్రపంచవ్యాప్తంగా ఉనికి ఆధారంగా బ్రాండ్ విలువను లెక్కించి ఏటా క్రెల్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. 2022 ఏడాదిగానూ 25 మందితో తాజాగా జాబితాను ప్రకటించింది. టాప్-25 సెలబ్రిటీల మొత్తం బ్రాండ్ విలువ గతేడాదితో పోలిస్తే 29.1 శాతం పెరిగింది. వారి మార్కెట్ 1.6 బిలియన్ల డాలర్లకు చేరింది. గత రెండేళ్లుగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ వాల్యూ క్రమంగా పడిపోతోంది. 2020లో 237.3 మిలియన్ డాలర్లుగా ఉన్న కోహ్లీ బ్రాండ్ విలువ 2021లో 185.7 మిలియన్ల డాలర్లకు పడిపోయింది. తాజాగా 176.9 మిలియన్ డాలర్లకు డౌన్ అయ్యింది. దీంతో ఈ జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ 158.3 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అక్షయ్ 2021లో 181.7 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచాడు.
2021లో 68.1 మిలియన్ డాలర్లుగా ఉన్న అలియా భట్ బ్రాండ్ విలువ 2022లో ఏకంగా 102.9 మిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. దీపికా పదుకొనె 82.9 మిలియన్ల డాలర్లతో 5వ స్థానంలో నిలిచింది. మాజీ క్రికెటర్లు ధోనీ 80.3 మిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, 73.6 మిలియన్ డాలర్ల విలువతో సచిన్ టెండూల్కర్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. 55.7 మిలియన్ డాలర్లతో షారుక్ పదో స్థానంలో, 54.5 మిలియన్ డాలర్లతో సల్మాన్ 11వ స్థానంలో ఉన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ 31.4 మిలియన్ డాలర్లతో 20వ స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా టాప్-25లో తొలిసారి చోటు సంపాదించాడు. నీరజ్ చోప్రా 26.5 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో పీవీ సింధుతో కలిసి సంయుక్తంగా 23వ స్థానంలో నిలిచాడు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న 25.3 మిలియన్ డాలర్లతో 25వ స్థానంలో ఉంది.