Tollywood.. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2 (Pushpa 2). అయితే ఈ సినిమా కారణంగా జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy)తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య థియేటర్లో పుష్ప -2 బెనిఫిట్ షోస్ సందర్భంగా జరిగిన తొక్కేసలాట ఘటనతో ప్రభుత్వం కాస్త అప్రమత్తమయ్యింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇక ఈ మేరకు తెలంగాణలో విడుదల అయ్యే ఏ చిత్రానికైనా సరే ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సంధ్య థియేటర్లో తొక్కిసలాట.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప -2 సినిమాను డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోలు వేసిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే హైదరాబాదులో సంధ్యా థియేటర్ 70mmలో సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా విచ్చేశారు. థియేటర్ కి అల్లు అర్జున్ రాకముందు వరకు వాతావరణం ప్రశాంతంగానే సాగింది. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చారో అప్పుడే అసలు తొక్కిసలాట మొదలయ్యింది. అభిమానులు అల్లు అర్జున్ ను చూడడానికి ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరగగా.. అక్కడ 39 సంవత్సరాలు వయసున్న రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఇక ఆమె బాలుడు కూడా తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే సిపిఆర్ చేసి హాస్పిటల్ కి తరలించగా.. ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ముఖ్యంగా పలువురు బిజెపి నాయకులు కూడా అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత లేకుండా ఆ సమయంలో అల్లు అర్జున్ సినిమా చూడాల్సిన అవసరం ఏముందంటూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు బాధిత మహిళా కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్న నేపథ్యంలో.. మైత్రి మూవీ మేకర్స్ కూడా స్పందించి సరైన సహకారాలు అందిస్తామని వెల్లడించారు.ఇక ఈ నేపథ్యంలోనే ఇకపై బెనిఫిట్ షోల ద్వారా భవిష్యత్తులో ఇలా జరగకుండా అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిర్మాతలు..
సాధారణంగా బెనిఫిట్ షోలకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిర్మాతలు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేయడం కోసమే బెనిఫిట్ షోలు వేస్తారు. ఇప్పుడు ఇలాంటి షోలను రద్దు చేయడంతో అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట సినీ నిర్మాతలు. అసలు ఆ సమయంలో అల్లు అర్జున్ ఎందుకు వెళ్లాలి..? ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా ముందే సంధ్య థియేటర్ యాజమాన్యానికి, అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా.. ఎటువంటి సమాచారాలు లేకుండా నేరుగా వెళ్లిపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి అని ఫైర్ అవుతున్నారట. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ వల్ల అందరిపై భారం పడనుంది అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పుష్ప -2 దెబ్బకు నిర్మాతలు అందరూ భారీగా భవిష్యత్తులో నష్టపోయే అవకాశాలున్నట్లు సమాచారం.