Kuberaa: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేర. అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. కింగ్ అక్కినేని నాగార్జున సపోర్టింగ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక జూన్ 20న కుబేర రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం సినిమా నుంచి వరుస సాంగ్స్ ను రిలీజ్ చేస్తుంది.
తాజాగా కుబేర సినిమా నుంచి పిప్పి పిప్పి.. డుమ్ డుమ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నిన్న ఈ సాంగ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరిగింది. ఇక ఈ సాంగ్ మొత్తం ఎంతో హైప్ తెప్పిస్తుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు చైతన్య పింగళి లిరిక్స్ అందించగా ఇంద్రవతి చౌహన్ ఎంతో అద్భుతంగా ఆలపించింది. ఇంద్రవతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అంటూ ఒక్క పాటతో ఇండస్ట్రీని షేక్ చేసి ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారింది. సింగర్ ఇంద్రవతి.. ఫోక్ ర సింగర్ మంగ్లీ చెల్లెలు అని కూడా అందరికీ తెలిసిందే.
ఇక ఈ సాంగ్ ను లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియోతోనే మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ లో రష్మిక హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు అందరూ కలిసి ప్రేమ వద్దు.. సింగిల్ గా ఉండటమే ముద్దు అని పాడుకుంటున్న సందర్భమని తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటే వైఫ్ ఎలా ఉంటుంది..? ఆమె ఏం చేయాలి అనేది చెప్తూ .. లైఫ్ లో పెళ్లి కన్నా ఇలా సింగిల్ గా ఉండటమే బాగుంటుందని అమ్మాయిలు అనుకుంటున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. రష్మిక తన డాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
కుబేర సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. శేఖర్ కమ్ముల లాంటి ఒక స్టార్ డైరెక్టర్ మొదటిసారి ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఇక మొట్టమొదటిసారి కింగ్ నాగార్జున హీరో అనే ట్యాగ్ నుంచి బయటకు వచ్చి ఒక కీలక పాత్రలో నటించడం అనేది విశేషం. నిన్న ఈవెంట్లో నాగార్జున తన పాత్ర గురించి, ఈ పాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు.
“శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఆయనే నన్ను కలిసి కుబేరలో ఒక పాత్రలో నటించమని కోరారు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇలాంటి పాత్ర చేయలేదు. హీరోగా చేసి బోర్ కొట్టేసి ఇలాంటి మంచి పాత్ర చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేశాను” అని నాగార్జున చెప్పుకొచ్చాడు. హీరో ధనుష్ కన్నా ఎక్కువగా నాగార్జునను ఈ పాత్రలో చూడడానికే ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి మొట్టమొదటిసారి నాగార్జున సపోర్టివ్ రోల్ చేసిన కుబేర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.