Siddu Jonnalagadda: కుర్ర హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన సిద్దు.. హీరోగా తన సినిమాలకు తానే మాటలు అందిస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. డీజే టిల్లు .. సిద్దు లైఫ్ మొత్తాన్ని మార్చిసింది. ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చేసింది. ఇక దీని తరువాత టిల్లు స్క్వేర్ కూడా మంచి హిట్ అందుకోవడంతో సిద్ధుకు తిరుగులేకుండా పోయింది.
ప్రస్తుతం సిద్దు వరుస సినిమాలతో బిజీగా మారాడు. టిల్లు స్క్వేర్ తరువాత జాక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10 న రిలీజ్ అయ్యి పరాజయాన్నీ అందుకుంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. మొదటి నుంచి ఈ సినిమా ఏదో తేడాగా ఉందనే మాట వినిపిస్తూనే వచ్చింది. సినిమా షూటింగ్ మధ్యలోనే సిద్ధుకు, భాస్కర్ కి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ప్రమోషన్స్ లో కూడా ఈ విభేదాల గురించి ఇద్దరు మాట్లాడారుకూడా.
ఇక ఈ సినిమా కథ.. సిద్ధుకు సెట్ కాలేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. మొత్తం బయ్యర్లు నష్టపోయారు. నిర్మాత భారీగా నష్టపోయాడు. దీంతో సిద్దు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెమ్యూనరేషన్ లో కొంత డబ్బును వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు ఆ పేమెంట్ జరగనుందని తెలుస్తోంది. నైజాం థియేటర్ హక్కుల విషయంలో సిద్దు కూడా కలుగజేసుకున్నాడని, దీంతో బయ్యర్ల ఎంత నష్టపోయారో తెలుసుకున్న సిద్దు.. దాదాపు నాలుగు కోట్లు వెనక్కి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. నిజం చెప్పాలంటే సిద్దు మంచి నిర్ణయమే తీసుకున్నాడు.
గతంలో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు.. తాము నష్టపోయామని, తమకు నష్టపరిహారం ఇవ్వాలని హీరో కొత్త సినిమా రిలీజ్ టైమ్ లో గొడవలు పెట్టుకున్న సంఘటనలు చాలా జరిగాయి. అలాంటివేమి జరగకుండా సిద్దు ముందుగానే ఆలోచించుకొని.. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయడానికి సిద్దమయ్యాడు. ఎందుకంటే.. సిద్దు నటించిన కొత్త సినిమా తెలుసు కదా అక్టోబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంకోపక్క నిర్మాత కూడా మరో సినిమాకు పెట్టుబడి పెట్టుకోవాలి కాబట్టి.. ఈ సమయంలోనే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది. ఇక బయ్యర్లు నష్టపోవడంతో డబ్బులు వెనక్కి ఇస్తానని ముందుకు రావడంతో ఫ్యాన్స్ సిద్దును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సిద్దు కెరీర్ విషయానికొస్తే.. జాక్ పరాజయం తరువాత సిద్దు తెలుసు కదా సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ చిత్రంలో సిద్దు సరసన శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హిట్ 3 తరువాత శ్రీనిధి శెట్టి మంచి గుర్తింపు వచ్చింది. ఆ హైప్ కూడా తెలుసు కదా సినిమాకు ఉపయోగపడేలా ఉంది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.