Adipurush : బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు నిరాశ పరిచినప్పటికీ.. డార్లింగ్ మాత్రం రాబోయే ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆయన ఫ్యాన్స్ సైతం ఎగ్జయిట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ విడుదలవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ చూసి.. సినిమా యానిమేషన్ మూవీలా ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే ప్రభాస్ అండ్ టీమ్ మాత్రం ఆది పురుష్ మూవీపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు.
అయితే తాజా సమాచారం మేరకు ‘ఆది పురుష్’కి సంబంధించి నెట్టింట వార్తొకటి తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని ప్రకటించిన ఈ సినిమా రిలీజ్ మరి కాస్త వెనక్కి వెళుతుందట. అందుకు కారణం.. చిరంజీవి, బాలయ్య, తమిళ హీరో విజయ్ సినిమాలపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ‘ఆది పురుష్’పై ఉన్న అంచనాలు టీజర్తో తగ్గిపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ సైతం ప్రభాస్ సినిమాను కాస్త వెనక్కి వెళ్లమనే సజెస్ట్ చేస్తున్నారట. దీంతో డార్లింగ్ తన ‘ఆది పురుష్’ సినిమాను వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తే.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటించారు.