Trivikram: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో చేసిన గుంటూరు కారం సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు టాలీవుడ్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అసలు ముందు మహేష్తో పవర్ ప్యాక్డ్ యాక్షన్ స్టోరీ రాసుకున్నాడు త్రివిక్రమ్. ఫైట్ మాస్టర్స్ అన్బరివ్లతో ఒక సాలిడ్ యాక్షన్ ఫైట్ కూడా షూట్ చేశారు. కానీ రాజమౌళితో చేయబోతున్న ప్రాజెక్ట్ పెద్దది కావడంతో.. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ వద్దనుకున్నాడు మహేష్. ఫలితంగా అప్పటికప్పుడు తన దగ్గర ఉన్న కథల్లో ఒకటి తీసి మదర్ సెంటిమెంట్తో గుంటూరు కారం చేశాడు త్రివిక్రమ్. ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ, జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. దీంతో.. నెక్స్ట్ ప్రాజెక్ట్తో కుమ్మేయాలని అనుకున్నాడు మాంత్రికుడు. పుష్ప 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఐకాన్ స్టార అల్లు అర్జున్తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశాడు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు బన్నీ కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో సినిమా చేస్తున్నాడు. దీంతో.. ఈ గ్యాప్లో మరో హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట త్రివిక్రమ్.
నాని, విజయ్ దేవరకొండ కాదు?
వాస్తవానికైతే.. ఈ పాటికే బన్నీ-త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఈ ప్రాజెక్ట్ను చాలా భారీగా మైథలాజికల్గా ప్లాన్ చేస్తున్నారు. అందుకు చాలా సమయం కావాలి. ఇప్పటికే పుష్ప సినిమాతో చాలా గ్యాప్ ఇచ్చాడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప కోసం మూడు నాలుగేళ్లు సమయం కేటాయించాడు. అందుకే ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమా చేయాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముందు అట్లీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి.. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఐకాన్ స్టార్. ఈలోపు త్రివిక్రమ్, బన్నీ ప్రాజెక్ట్ పై కసరత్తులు చేస్తాడని అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. బన్నీ సినిమా సెట్స్ పైకి వెళ్లేలోపు.. ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలో.. నాని, విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే ఈ ఇద్దరు ఓ సినిమా కోసం కలిసి వర్క్ చేయడంతో ఈ కాంబో ఇంట్రెస్టింగ్గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్సా?
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తు దూసుకుపోతున్న ధనుష్.. టాలీవుడ్ పై కూడా కాస్త గట్టిగానే ఫోకస్ చేశాడు. ఇప్పటికే త్రివిక్రమ్ హోం బ్యానర్ అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫోర్చ్యున్ ఫోర్ బ్యానర్లో ధనుష్తో తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ ‘సార్’ చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక్కడి నుంచి ధనుష్, త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. ధనుష్తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ధనుష్ కూడా టాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి.. ఈ కాంబో ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం.. చాలా ఆసక్తికరంగా మారనుంది. మరి త్రివిక్రమ్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.