Vijay Antony: సాధారణంగా ఇండస్ట్రీలో ఒకే లాంటి కథలు రావడం చూసాం. ఒకే సినిమా టైటిల్ తో రెండు, మూడు సినిమాలు రావడం చూసాం. కానీ, ఒకేసారి ఒకే టైటిల్ ను ఇద్దరు స్టార్ హీరోలు ప్రకటించడం మొదటిసారి జరిగింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా.. ? లేక కావాలనే చేశారా.. ? అనేది మిస్టరీగా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు .. ? ఆ సినిమా ఏంటి.. ? అనేది చూద్దాం.
కోలీవుడ్ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ గురించి అందరికీ తెల్సిందే. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఇక బిచ్చగాడు 2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. విజయాపజయాలను లెక్కచేయకుండా తాను నటించిన ప్రతి సినిమాను అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. గతేడాది లవ్ గురు, హిట్లర్, తుఫాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూడు సినిమాలు విజయ్ ఆంటోనీకి పరాజయాన్ని అందించాయి.
ఇక ప్లాప్స్ ను పక్కన పెట్టి ప్రేక్షకులను ఎలాగైనా మెప్పించాలని విజయ్ ఆంటోనీ VA25 సినిమాను ప్రకటించాడు. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీనే నిర్మిస్తున్నాడు. అంతేకాదు.. ఆయన సినిమాకు ఆయనే మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక నేడు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు విజయ్ ఆంటోనీ. తన 25 వ చిత్రానికి పరాశక్తి అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించాడు.
పరాశక్తి పోస్టర్ లో విజయ్ ఆంటోనీ.. గన్ పట్టుకొని కూర్చున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మరో పరాశక్తి సినిమా టైటిల్ బయటకు వచ్చింది. స్టార్ హీరో శివకార్తికేయన్- సుధా కొంగర కాంబోలో వస్తున్న సినిమాకు కూడా అదే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుపుతూ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. శివకార్తికేయన్, అథర్వ, రవి మోహన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.
Prithviraj Sukumaran: SSMB 29 లో విలన్ గా స్టార్ హీరో.. ఇదిగో క్లారిటీ
ఇక ఇంకొక విశేషం ఏంటంటే.. శివకార్తికేయన్ కు కూడా ఇది 25 వ సినిమానే. గంటల వ్యవధిలోనే ఇద్దరు స్టార్ హీరోలు ఒకే టైటిల్ తో తమ సినిమాను ప్రకటించడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మొదట విజయ్ ఆంటోనీనే తన సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఆ టైటిల్ మా హీరోది అంటే మా హీరోది అని ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ ట్రోల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు విజయ్ ఆంటోనీ. పరాశక్తి తన టైటిల్ అంటూ ఆధారాలతో సహా నిరూపించాడు.
పరాశక్తి టైటిల్ ను విజయ్ ఆంటోనీ.. గతేడాదిలోనే రిజిస్టర్ చేయించిన పత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో గతేడాది జూలైలోనే విజయ్ ఆంటోని ఫిల్మ్స్ వారికి రిజిస్టర్ చేస్తున్నట్లు ఛాంబర్ సంతకం పెట్టినట్లు ఆ పత్రంలో ఉంది. దీంతో పరాశక్తి టైటిల్ విజయ్ కే దక్కుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై శివకార్తికేయన్- సుధా కొంగర ఎలా స్పందిస్తారో చూడాలి.
— vijayantony (@vijayantony) January 29, 2025