Locust Infestations : మీకు గుర్తుందా.. నాలుగేళ్ల క్రితం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై మిడతలు దండెత్తిన విషయం? ఒక్క రాజస్థాన్లోనే 8 జిల్లాల్లో ఏకంగా 1.79 లక్షల హెక్టార్లలో పంటను అవి ధ్వంసం చేశాయి. 2020-21లోనూ అంతే. మొత్తం పది రాష్ట్రాలపై మిడతల దండు ప్రభావం పడింది.
అసాధారణ గాలులు, వర్షాల వల్ల ఎడారి మిడతలు విరుచుకుపడే ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మనం చేస్తున్న కీడు ఫలితంగా జరిగే పర్యావరణ మార్పులు మిడతల ముప్పును మరింత తీవ్రతరం చేస్తాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయనానికి నేతృత్వం వహించిన జియోగాంగ్ హి స్పష్టం చేశారు.అనూహ్యకర పరిస్థితుల్లో మిడతలు దండెత్తడానికి క్లైమేజ్ ఛేంజ్ ఎంతో ఊతమిస్తుందని వివరించారు.
ఉత్తర-తూర్పు ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియా దేశాల్లోని పొడి ప్రాంతాల్లో ఎడారి మిడతలు కనిపిస్తాయి. ఇవి వలస జీవులు. ఆహారం కోసం లక్షల సంఖ్యలో సుదీర్ఘ దూరాలకు పయనిస్తుంటాయి. పెద్దఎత్తున పంటలకు నష్టం చేకూరుస్తాయి. వీటి వల్ల కరువు, ఆహార అభద్రత చోటు చేసుకుంటాయి. ఇవి దండయాత్ర చేస్తే మామూలుగా ఉండదు. చదరపు కిలోమీటరు సమూహంలో 8 కోట్ల మిడతలు ఉంటాయి. 35 వేల మందికి సరిపడా ఆహారపంటలను ఆ సమూహం ఒక్క రోజులోనే గుటకాయస్వాహా చేసేయగలదు. ప్రపంచంలో అత్యంత విధ్వంసకర వలస కీటకాలు ఇవే.
మిడతలను నియంత్రించేందుకు దేశాలు, సంస్థల మధ్య సహకారం ఎంతో అవసరం. మిడతల ముప్పును ముందుగానే పసిగట్టే హెచ్చరిక వ్యవస్థలూ అనివార్యమే. 1985-2020 మధ్య మిడతలు సృష్టించిన విధ్వంసాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేశారు. మొత్తం 48 దేశాలు వీటి ప్రభావాన్ని చవిచూశాయి. అందులోనూ కెన్యా, మొరాకో, నైగర్, యెమెన్, పాకిస్థాన్ సహా పది దేశాలకు మిడతల వల్ల అపార నష్టం వాటిల్లింది.
2019, 2020 సంవత్సరాల్లో తూర్పు ఆఫ్రికాపై ఎడారి మిడతలు దండెత్తాయి. గత 25 ఏళ్లలో అంత పెద్దఎత్తున దండెత్తడం అదే. పంటలనే కాదు.. చెట్లుచేమలను సైతం అవి మింగేయగలవు. ఒక్క మాటలో పచ్చదనం ఎక్కడున్నా క్షణాల్లో మాయం చేసేస్తాయి.