America: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ పరీక్ష చేస్తున్నారో ఆ విషయం ఎవరికీ తెలియదన్నారు. బహుశా భూగర్భంలో నిర్వహిస్తారని అభిప్రాయపడ్డారు. చైనా కూడా ఇదే పనిలో నిమగ్నమైందన్నారు.
పాక్-చైనాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు నోరు విప్పితే చాలా దేశాలు సీరియస్గా తీసుకునేవి. అగ్రరాజ్యం దృష్టిలో పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసేవి. అదంతా ఒకప్పటి మాట..ఇప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చాక అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి మారిపోయింది. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు.
ఈ క్రమంలో రోజు తప్పించి రోజు భారత్, చైనా, పాకిస్తాన్, రష్యా, నార్త్ కొరియా పేరు ఎత్తకుండా ఉండలేకపోతున్నారు. బహుశా వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ఇప్పటి నుంచి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు కొంతమంది ప్రత్యర్థులు. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం. పాకిస్థాన్ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
అణ్వాయుధ పరీక్షలు తామెందుకు చేయకూడదు?-ట్రంప్
పాకిస్థాన్ ఆ పని చేస్తున్నప్పుడు తాము అణ్వాయుధాలను పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికై పాకిస్తాన్, చైనాలు ఆ పని చేస్తున్నాయన్నారు. సీబీసీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. రష్యా కూడా అదే పని చేస్తోందని, ఉత్తర కొరియా ఇప్పటికే చేసిందన్నారు. దీని విషయంలో ఆ దేశాలు ఏమీ చెప్పవని, తాము అన్నీ ఓపెన్గా చెబుతామన్నారు.
రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి అనేక దేశాలు అణు పరీక్షలు నిర్వహిస్తున్నందున ఈ చర్య అవసరమని, అమెరికా కూడా అలా చేయడం సముచితమని ట్రంప్ పేర్కొన్నారు. అణ్వాయుధాలను తయారు చేసిన తర్వాత వాటిని పరీక్షించకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రయోగించినప్పుడే అవి పని చేస్తున్నాయో లేదో తెలుస్తుందన్నారు.
ALSO READ: ఎవరెస్టు బేస్ క్యాంప్.. విరుచుకుపడిన హిమపాతం
ట్రంప్ వ్యాఖ్యలను చైనా ఖండించింది. అణ్వాయుధ పరీక్షల నిషేధానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ విషయంలో పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ట్రంప్ వ్యాఖ్యలను దేశీయ రక్షణ రంగ నిపుణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ట్రంప్ మాటలను రెండు రకాలుగా అర్థం చేసుకుంటున్నారు. అమెరికాతో భారత్ వ్యాపారం చేయాలన్నది ఆయన పట్టుదల.
ఈ క్రమంలో భారత్ వస్తువులపై ఆ దేశంలో పన్నులు అమాంతంగా పెంచేశారని అంటున్నారు. అన్నిదేశాలతో మానేసి కేవలం అమెరికా వద్ద యుద్ద సామాగ్రి కొనుగోలు చేయాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోందని, ఈ క్రమంలో రకరకాలుగా ఆయన కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు.
మరికొందరు మాత్రం ట్రంప్ మాటలను తేలిగ్గా తీసుకోకూడదని, ఎంతో కొంత నిజం ఉందని అంటున్నారు. అయినా నోబెల్ శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆయన, అణ్వాయుధాలను తయారు చేయరని అంటున్నవాళ్లూ లేకపోలేదు. పాక్-చైనా న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేస్తోందని చెప్పి భారత్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. రానున్న రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకెన్ని విషయాన్ని బయటపెడతారో చూడాలి.