Arc de Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో… ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 250 అడుగుల (76 మీటర్ల) ‘ట్రయంఫల్ అర్చ్’ నిర్మించాలని నిర్ణయించారు. ఈ వివాదాస్పద ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది. పారిస్ స్ఫూర్తికి నివాళిగా “ఆర్క్ డి ట్రంప్” అనే పేరు మీద ఈ స్మారక చిహ్నం నిర్మించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప, అందమైన విజయ తోరణంగా ట్రయంఫల్ ఆర్చ్ నిలుస్తుందని అమెరికా అధ్యక్షుడు శుక్రవారం సోషల్ మీడియాలో తెలిపారు. ఫైన్ ఆర్ట్స్ కమిషన్కు ఈ ఆర్చ్ ప్రణాళికలను సమర్పించామని, ఆ కమిటీ వచ్చే వారం ఈ ప్రతిపాదనను సమీక్షిస్తుందని వైట్ హౌస్ తెలిపింది.
అయితే ఈ ప్రాజెక్టుపై ట్రంప్ స్పందిస్తూ.. తనదైన శైలిలో వాషింగ్టన్ డీసీకి కొత్త రూపునిచ్చేందుకు ఇది నిర్మిస్తున్నట్లు చెప్పారు. వైట్ హౌస్ బాల్రూమ్కు సంబంధించిన ప్లానింగ్ ప్రస్తుతం న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాయి. ‘ఆర్క్ డి ట్రంప్’ ఆర్చ్ కు కోర్టు ఆమోదం లభిస్తే…ఈ స్మారక చిహ్నం యూఎస్ క్యాపిటల్ భవనం, లింకన్ మెమోరియల్ కంటే ఎత్తులో ఉండనుంది. రాబోయే అనేక దశాబ్దాల పాటు అమెరికన్లందరూ దీని గురించి మాట్లాడుకుంటారని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.
ఈ ఆర్చ్ లో “One Nation Under God” అని బంగారు అక్షరాలతో రాసి ఉంటుంది. దానిపై రెండు బంగారు గద్దలు, బంగారు రెక్కలున్న లేడీ లిబర్టీ ఉన్నాయి. ఆర్చ్ కింద భాగంలో గోల్డెన్ లయన్స్ విగ్రహాలు ఉంటాయి. ఈ తోరణంపై 250 ఏళ్ల యూఎస్ చరిత్రలో ఎందరో అమెరికన్ వీరులు చేసిన మహోన్నత త్యాగాలకు స్మారకంగా నిలుస్తుందని ట్రంప్ చెప్పారు. ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికలో మాజీ సైనికులు, అమరవీరుల కుటుంబాలు, సందర్శకుల అనుభవాన్ని ఈ తోరణం మరింత మెరుగుపరుస్తుంది. వారి త్యాగాల వల్లే ఇవాళ మనం స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నామని వైట్ హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read: సమయం లేదు మిత్రమా.. ఒక్కరోజులో ఇరాన్ మటాష్, ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ ఆర్చ్ కు నిధులు ఎలా సమకూరుస్తారనే సమాచారాన్ని వైట్ హౌస్ ఇంకా వెల్లడించలేదు. వైట్ హౌస్ బాల్రూమ్ ప్రాజెక్ట్కు నిధులు సమకూరడంతో, దానిలోకి కొంత భాగాన్ని ఈ తోరణం నిర్మాణానికి వినియోగిస్తామని ట్రంప్ గతంలో చెప్పారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు, ఈ ఆర్ట్ ఫ్రాన్స్లోని ఆర్క్ డి ట్రయంఫ్ను పోలి ఉండాలని, అలాగే ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటిక నుంచి మెమోరియల్ బ్రిడ్జిని దాటి దేశ రాజధాని నగరంలోకి వచ్చే ప్రజలకు స్వాగతం పలకాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు.