Strait of Hormuz: హర్మూజ్ జలసంధి నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఓడలు సముద్రం గుండా ప్రయాణం చేస్తూ మన దేశానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..? ఓడలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు స్టే చేస్తాయో తెలుసా..? మనదేశంలోనే ఒక్కో ప్రాంతానికి వెళ్లాలంటే ఒక్కో సమయం పడుతుంది. అయితే ఓవరాల్గా ఓడలు ప్రయాణించే సమయం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరాన్, ఇజ్రాయేల్ అమెరికాల మధ్య యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ యుద్దం కొనసాగుతూనే ఉంది. అయితే ఇరాన్ యుద్దం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది హర్మూజ్ జలసంధి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన ఈ మార్గం నుంచి బయలుదేరిన ఓడలు మన దేశానికి చేరుకోవడానికి ఎంత సమయం తీసుకుంటాయో తెలుసుకుందాం.
హార్ముజ్ జలసంధి నుంచి భారత పశ్చిమ తీరానికి ఓడలు చేరడానికి సాధారణంగా 2 నుంచి 3 రోజులు పడుతుంది. ఓడ గమ్య స్థానం ఏ పోర్ట్ అనేదానిపై ప్రయాణ సమయం మారుతుంది. ఉదాహరణకు ఒక ఓడ సగటుగా గంటకు సుమారు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గుజరాత్లోని కాండ్లా పోర్ట్కు దాదాపు 37 గంటల్లో చేరే అవకాశం ఉంటుంది. ముంబై పోర్ట్కు వెళ్లే ట్యాంకర్లు సాధారణంగా 50 గంటలకుపైగా సమయం తీసుకుంటాయి.
ఒకవేళ కార్గో భారత తూర్పు తీరంలోని పోర్ట్లకు వెళ్లాల్సి ఉంటే ప్రయాణం మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు వెళ్లే ఓడలు భారత దక్షిణ చివర చుట్టూ తిరిగి ప్రయాణించాలి. ఈ మార్గంలో ఓడలు శ్రీలంక చుట్టూ తిరిగి బంగాళాఖాతంలోకి ప్రవేశించాలి. అందువల్ల ఈ ప్రయాణానికి మరికొన్ని రోజులు అదనంగా పడుతుంది.
చాలా ఆయిల్ ట్యాంకర్లు తమ ప్రయాణాన్ని ఫార్సీ గల్ఫ్ (Persian Gulf) ప్రాంతంలోని పెద్ద పోర్టుల నుంచి ప్రారంభిస్తాయి. అందులో ముఖ్యమైంది రాస్ తనురా పోర్ట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి టర్మినల్స్లో ఒకటి. ఈ పోర్టుల నుంచి ట్యాంకర్లు ముందుగా హోర్ముజ్ జలసంధి వైపు కదులుతాయి. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడం ఓడలకు అత్యంత సున్నితమైన దశగా భావిస్తారు. ఈ ప్రాంతంలో భద్రతా సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఓడలు కచ్చితమైన నావిగేషన్ మార్గాలను పాటించాల్సి ఉంటుంది. జలసంధిని సురక్షితంగా దాటిన తర్వాత ఓడలు ఒమాన్ తీరాన్ని దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి ప్రయాణం కొంత సులభంగా సాగుతుంది.
హార్ముజ్ జలసంధి నుంచి భారత్ వరకు ఉన్న సముద్ర మార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి. భారత్కు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. అందుకే ఈ మార్గం సురక్షితంగా ఉండటం భారత దేశం ఇంధన భద్రతకు చాలా కీలకంగా భావిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. బిగ్ టీవీ సొంతం క్రియేట్ చేసి రాసినవి కాదని పాఠకులు గమనించాలి.