ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఒక విమాన ప్రమాదం జరిగినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన ATR 42-500 విమానం మకాస్సర్ సమీపంలో రాడార్ నుండి అదృశ్యమైంది. ఈ విమానం సమీపంలోని ఒక పర్వత ప్రాంతంలో కూలిపోయి ఉండవచ్చని, అక్కడ విమాన శకలాలను గుర్తించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
రాడార్ సిగ్నల్ కట్..
ప్రముఖ విమాన ట్రాకింగ్ సర్వీస్ FlightRadar24 అందించిన వివరాల ప్రకారం, ఈ విమానం సముద్రంపై తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. మకాస్సర్ విమానాశ్రయానికి ఈశాన్య దిశలో సుమారు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలో, 04:20 UTC సమయానికి చివరి సిగ్నల్ రికార్డ్ అయినట్లు సమాచారం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి రూటింగ్ సూచనలు అందుకుని విమానాశ్రయానికి చేరువవుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణికులు ఎంత మందంటే..?
ప్రమాద సమయంలో విమానంలో ఎనిమిది మంది సిబ్బందితో పాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే, విమానంలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం అందలేదు. విమానం కూలిపోయిందనే వార్తలపై ఇండోనేషియా ప్రభుత్వం లేదా పౌర విమానయాన శాఖ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ముమ్మరంగా గాలింపు చర్యలు..
విమానం అదృశ్యమైన వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ఇండోనేషియా శోధన మరియు రెస్క్యూ ఏజెన్సీ రంగంలోకి దిగింది. మకాస్సర్ విభాగం ఆపరేషన్స్ హెడ్ ఆండి సుల్తాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విమానం చివరిగా కనిపించిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలను ఇప్పటికే పంపినట్లు వెల్లడించారు. పర్వత ప్రాంతంలో శకలాలు కనిపించాయన్న వార్తల నేపథ్యంలో ఆ దిశగా గాలింపును తీవ్రతరం చేశారు.