USA Iran Talks: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇరాన్, అమెరికా చర్చలు మరికొన్ని గంటల్లో పాకిస్తాన్ వేదికగా జరగనున్నాయి. ఇరాన్ ప్రతినిధి బృందం శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్కు చేరుకొంది. వీరికి పాకిస్తాన్ అధికారులు స్వాగతం పలికారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాక్ కు చేరుకుంది. చర్చలు ప్రారంభానికి ముందే ట్రంప్ బాంబ్ పేల్చారు. ఇరాన్ అంత ఛాన్స్ లేదని, అన్ని అవకాశాలు అమెరికాకే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇరాన్ మాత్రం తమ అన్ని షరతులకు యూఎస్ అంగీకరిస్తేనే చర్చలు ముందుకెళ్తాయని స్పష్టం చేసింది. రక్షణ మండల కార్యదర్శి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్, రాజకీయ, సైనిక నాయకులు ప్రతినిధి బృందంలో ఉన్నారు.
చర్చలు సజావుగా సాగితే 40 రోజులకు పైగా సాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం ముగుస్తుంది. అయితే, వాషింగ్టన్ శాంతి ఒప్పందాన్ని టెహ్రాన్ తిరస్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇస్లామాబాద్లో చర్చలకు ముందు గంటల వ్యవధిలో శుక్రవారం రాత్రి ఇరాన్ కు ఎలాంటి అవకాశాలు లేవని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ ప్రభుత్వానికి చెందిన రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్లామాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి దిగాయి. ఇరాన్ ప్రతినిధుల రాకను పాకిస్తాన్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్, పాక్ అధికారులు ఇరాన్ ప్రతినిధులకు స్వాగతం పలికారు. చర్చలు ముందుకుసాగేందుకు ఇరాన్ పలు షరతులు పెట్టింది. కాల్పుల విరమణలో లెబనాన్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఆంక్షల పేరిట స్తంభింపజేసిన తమ ఆస్తులను రిలీజ్ చేయాలని పేర్కొంది. వీటిపై స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు ముందుకుసాగుతాయని ఇరాన్ తేల్చి చెప్పింది.
చర్చల తరుణంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై తమకు మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆ దేశంపై నమ్మకం మాత్రం లేదన్నారు. రెండు సార్లు చర్చలు జరుగుతుండగానే తమపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను యూఎస్ గుర్తిస్తేనే, ఒప్పందం చేసుకుంటామన్నారు. చర్చలను కేవలం ఓ ప్రచారంగానే భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించారు.
Also Read: ఇరాన్ చేతికి అణు బాంబు.. ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా?
అమెరికా-ఇరాన్ చర్చల వేళ..కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలోని లెబనాన్-ఇజ్రాయెల్ రాయబారులు ఫోన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ, చర్చలకు మార్గం సుగమం చేయడంపై ఇరువురు మాట్లాడుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 14న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య అధికారిక సమావేశానికి ఇరు దేశాలు అంగీకరించాయి.