Missile Attack Netanyahu Office: పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు అగ్రనేతల నివాసాలను తాకుతున్నాయి. ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడిగా నిర్వహించిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రక పరిణామం తర్వాత రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్పై తన ప్రతీకార దాడులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది. మార్చి 2, 2026 (సోమవారం) నాడు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. తమ పదో విడత ప్రతీకార ఆపరేషన్ అయిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని విజయవంతంగా ధీకొట్టినట్లు పేర్కొంది.
ఈ దాడులు కేవలం ప్రధాని కార్యాలయానికే పరిమితం కాలేదు. ఇజ్రాయెల్ వైమానిక దళ (IAF) కమాండర్ తోమర్ బార్ నివాసాన్ని, వారి ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల కోసం ఇరాన్ తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ‘ఖైబర్’ (Khyber Shekan) బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ క్షిపణులు ఇజ్రాయెల్ యొక్క అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించి మరీ లక్ష్యాలను తాకాయని ఇరాన్ మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రధాని కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో నెతన్యాహు ఎక్కడ ఉన్నారనే అంశంపై ప్రస్తుతం అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దాడుల తర్వాత ఆయన పరిస్థితి అస్పష్టంగా ఉందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘తస్నిమ్’ పేర్కొంది. ప్రధాని ఆ సమయంలో కార్యాలయంలో ఉన్నారా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
ఇరాన్ చేస్తున్న క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ధ్వంసమైందంటూ వస్తున్న వార్తలపై ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు స్పందించాయి. ఈ ప్రచారాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తూ.. అవన్నీ కేవలం తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది. ఇరాన్ మీడియా చేస్తున్న ఈ ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని.. తమ దేశ రక్షణ వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయని స్పష్టం చేసింది.