గత కొంతకాలంగా ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి. ఆందోళనకారులపై భద్రతా దళాలు జరుపుతున్న కాల్పులను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఈ వెనకడుగు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,420 దాటినట్లు వివిధ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్న దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి. అయితే ఈ వీడియోల ప్రామాణికతను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించలేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన నిరసనకారులకు ఇరాన్ కోర్టులు వరుసగా ఉరిశిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే… తాజా పరిణామాల ప్రకారం నిరసనకారుడు ఇర్ఫాన్ సుల్తానీ సహా ఇతర ఖైదీలకు విధించిన ఉరిశిక్షలన్నింటినీ ఇరాన్ పాలక యంత్రాంగం తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం అందుతోంది. అంతర్జాతీయ సమాజం నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడిచ, ఆర్థిక ఆంక్షల హెచ్చరికల వల్లే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా జోక్యంతో ఇరాన్ తన కఠిన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆందోళనకారుల ప్రాణాలు తీయడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఇరాన్ సైన్యం ఫైరింగ్ ఆపేసిందని ట్రంప్ చెబుతున్నారు. ఇది నిరసనకారులకు పెద్ద విజయమని, అయితే ఇరాన్ ఈ నిర్ణయానికి ఎంతకాలం కట్టుబడి ఉంటుందనేది వేచి చూడాలని రాజకీయ నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతానికి వీధుల్లో కాల్పుల శబ్దం ఆగిపోయినప్పటికీ, ఇరాన్ అంతటా ఇంకా నిశ్శబ్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు ఇరాన్ చర్యలను నిశితంగా గమనిస్తున్నాయి.
ALSO READ: Jana Nayagan: విజయ్ సినిమాకు మరో ఎదురుదెబ్బ..నిర్మాతల పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు