MLA Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజే ఈ సుదీర్ఘ విచారణకు తెరదించుతూ స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు.
కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారని, వారు కాంగ్రెస్లో చేరినట్లు ఎటువంటి సాంకేతిక ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు.వారు పార్టీ ఫిరాయించినట్లు నిరూపితం కాలేదు కాబట్టి, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని తీర్పునిచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకున్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను పూర్తి చేశారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన స్పీకర్, ఇప్పుడు తాజాగా పోచారం, కాలె యాదయ్యలపై కూడా అదే విధమైన నిర్ణయాన్ని ప్రకటించారు.