Neuralink: మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి చేసే ప్రయోగాల విషయంలో మరో ముందడుగు పడింది. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్టప్ సంస్థ న్యూరాలింక్కు.. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. దీంతో కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బీసీఐ-బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు మార్గం సుగమమైంది. క్లినికల్ ప్రయోగాలకు అనుమతి రావడంపై న్యూరాలింక్కు ఎలాన్ మస్క్ అభినందనలు తెలిపారు. ప్రయోగాల కోసం త్వరలోనే నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం.
మెదడులో అమర్చే చిప్ సాయంతో ఆ మనిషి కంప్యూటర్తో సరాసరి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలరు. ఇప్పటికే కోతులపై విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం. అవి వాటి మెదడుతో వీడియోగేమ్స్ ఆడాయి. తెరపై కర్సర్ను కదల్చగలిగాయి. మనుషులపైనా విజయవంతమైతే ఈ సాంకేతికతతో చాలా ఉపయోగాలు ఉంటాయి. మున్ముందు మరింత విస్తృతమయ్యే కృత్రిమ మేధను మనిషి ఎదుర్కొనేందుకు, మానవ మేధస్సును పెంపొందించేందుకు ఇది అవసరమని.. న్యూరాలింక్ స్పష్టం చేసింది.
చిప్లో వాడే లిథియం బ్యాటరీ భద్రత, మెదడు ఆరోగ్యానికి దానివలన కలిగే ప్రమాదంవంటి వాటిపై నియంత్రణ సంస్థ గతంలోనే ఆందోళనలు వ్యక్తం చేసింది. అమెరికా రవాణా శాఖ న్యూరాలింక్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. ఎటువంటి భద్రత చర్యలు లేకుండా ప్రమాదకర సూక్ష్మక్రిములను సంస్థ తరలించిందన్న ఆరోపణలపై రవాణా శాఖ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేందుకు ఓ చిప్ను రూపొందిస్తున్నామని తెలిపింది. అలాగే చూపు కోల్పోయిన వారికి సైతం సాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ రెండింటిలో తాము కచ్చితంగా విజయం సాధిస్తామని న్యూరాలింక్ ధీమా వ్యక్తం చేస్తోంది.