చైనా వణికిపోతోంది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భయపడిపోతున్నారు. తమ దేశ ప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలా అనే ఆలోచనలో పడ్డారు. ఆ విపత్తు బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా దూసుకొస్తేంది. ఇప్పటికే ఫిలిప్పైన్స్ ని నాశనం చేసింది. తైవాన్, హాంకాంగ్, చైనాను చుట్టు ముట్టేందుకు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో చైనాలో భయం మొదలైంది. ముఖ్యంగా దక్షిణ చైనాలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
సూపర్ టైఫూన్ రగస..
ప్రపంచ దేశాల్లోనే అత్యంత మెరుగైన ఆయుధ సంపత్తిని చైనా సమకూర్చుకుంటోంది. అటు ఆర్థికంగా కూడా ఆ దేశం బలపడుతోంది. అయితే ప్రకృతికి మాత్రం చైనా తలవంచక తప్పదు. ప్రకృతి విపత్తులు టైఫూన్ల రూపంలో చైనాను వణికిస్తుంటాయి. తాజాగా అలాంటి విపత్తు రగస అనే టైఫూన్ రూపంలో వచ్చాయి. ఇది ఆల్రడీ ఫిలిప్పైన్స్ ని నిండా ముంచేసింది. తైవాన్ పై కూడా ప్రభావం చూపించింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఫిలిప్పైన్స్ లో విద్యుత్ వ్యవస్థ స్తంభించింది. స్కూళ్లు, ఆఫీస్ లు మూసివేశారు. విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తీరప్రాంతాల్లో వరదలు రావొచ్చని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ టైఫూన్ ఫిలిప్పైన్స్లోని కాగయన్ ప్రావిన్స్లోని పనౌయిటన్ ద్వీపంలో తీరాన్ని తాకింది. తర్వాతి ముప్పు చైనాకేననే అంచనాలున్నాయి.
వణుకుతున్న చైనా..
సూపర్ టైఫూన్ దక్షిణ చైనా వైపు దూసుకొస్తోంది. హాంకాంగ్, ఇతర ప్రధాన నగరాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. షెన్జెన్తో పాటు చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని నగరాలు దాదాపుగా ఖాళీ అయ్యాయి. ఆయా నగరాలనుంచి లక్షలాది మందిని ఖాళీ చేయిస్తున్నారు. అలలు ఉధృతంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అనేక నగరాల్లో పాఠశాలలు మూసివేశారు. వ్యాపారాలు స్తంభించాయి. రవాణా వ్యవస్థ కూడా ఆగిపోయింది. ఇక విమాన సేవలు కూడా పూర్తి స్థాయిలో రద్దు అయ్యాయి. హాంకాంగ్లోని అధికారులు మూడో తుఫాను ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రతి ఇంట్లో కిరాణా సామాగ్రిని నిల్వ చేసుకోవాలని సూచించారు. కిటికీలకు ట్యాపింగ్ చేయాలని చెప్పారు. గాలి తీవ్రతలను అంచనా వేయలేమని, ప్రతి ఒక్కరూ ఇళ్లలో సురక్షితంగా ఉండాలని సూచించారు. దక్షిణ చైనా తర్వాత తుఫాన్ వియత్నాం వైపు పయనిస్తుందని తెలుస్తోంది. దీంతో వియత్నాంలో సైనిక సిబ్బందిని రక్షణ చర్యలకోసం సిద్ధం చేశారు. రగస తుఫాన్ గతంలో వచ్చిన అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైనదని అంచనాలున్నాయి.
2017లో హాటో తుఫాను, 2018లో మాంగ్ఖుట్ తుఫానులకంటే ఈ రగస బలమైనది అని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ రెండు తుఫాన్ ల వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా చైనా మరచిపోలేదు. ఆ స్థాయిలో ఈసారి కూడా నష్టం జరుగుతుందని అంచనా. అయితే ఈసారి ప్రాణ నష్టం లేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. మరి దీనికి ఫలితం ఉంటుందా, ఊహించినదానికంటే ఎక్కువగా రగస విరుచుకుపడుతుందా? వేచి చూడాలి.