New Parliament Building Opening News(Morning news today telugu): భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు జరగబోయే వేడుకకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని 2 దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మొదటగా తెల్లవారుజామునే పాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సహా పలువురు సీనియర్ మంత్రులు పాల్గొననున్నారు. పూజ అనంతరం వీరంతా లోక్సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. లోక్సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. అనంతరం నూతన పార్లమెంట్ ఆవరణలోనూ పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 నిమిషాలలోపే పూర్తి కానున్నాయి.
మధ్యాహ్నం జాతీయ గీతాలాపనతో రెండో దశ వేడుకలు జరుగుతాయి. లోక్సభ ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా అతిథులు హాజరుకానున్నారు. తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్ ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మాట్లాడతారు. పార్లమెంట్ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తారు. తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. స్పీకర్ ప్రసంగం అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మాట్లాడానికి సమయాన్ని కేటయించినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడతారు.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా.. గుర్తుగా కేంద్రం 75 రూపాయల విలువైన స్మారక నాణెంను విడుదల చేయనుంది. నాణెం 34.65 గ్రాముల నుంచి 35.35 గ్రాముల బరువు ఉండనున్నట్లు సమాచారం. నాణేనికి ఒకవైపున 3 సింహాల గుర్తు, మధ్యలో దేవనాగరి లిపిలో ‘భారత్’ అని.. ఆంగ్లంలో ‘ఇండియా’ అని ఉంటాయి. అలాగే రూపాయి గుర్తును, నాణెం విలువను సూచిస్తూ 75 సంఖ్య అడుగు భాగాన ముద్రిస్తారు. నాణెం రెండో వైపున పార్లమెంటు భవనం బొమ్మ, సంవత్సరాన్ని సూచిస్తూ ‘2023’ను ముద్రిస్తారు.