H-1B వీసా విషయంలో అమెరికా ఇచ్చిన షాక్ కి భారత టెకీలు ఇంకా షాక్ లోనే ఉన్నారు. మిగతా దేశాలనుంచి అమెరికాకు వలస వెళ్లాలనుకుంటున్న వారికి కూడా ఇది ఇబ్బంది కలిగించే విషయమే. అమెరికా సమస్యలు సృష్టిస్తే, ఆ సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి బ్రిటన్, చైనా. అమెరికాకి వెళ్లొద్దు, తమ దేశాలకు రావాలంటూ ఆఫర్ల వల విసురుతున్నాయి. ఫీజు లేని వీసాలను పరిచయం చేస్తూ విదేశీ టాలెంట్ కి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.
రుసుము లేకుండా వీసా..
ప్రపంచంలో ఉన్న నిపుణులను తమ దేశానికి సాదరంగా స్వాగతిస్తోంది బ్రిటన్. అలాంటి వారికి రుసుము లేకుండానే వీసా జారీ చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 540 లక్షల పౌండ్లతో గ్లోబల్ ట్యాలెంట్ ఫండ్ను బ్రిటన్ ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ తో పాటు వీసా రుసుముని కూడా తగ్గించాలని చూస్తోంది. ప్రపంచంలోని టాప్-5 యూనివర్శిటీల్లో చదువుకున్న వారికి ప్రపంచ ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్న వారికి.. ఈ ఆఫర్ వర్తిస్తుంది. వారికిచ్చే వీసాలకు రుసుము చెల్లించనక్కర్లేదు.
అదే బాటలో చైనా..
ఉన్న జనాభాతోనే సతమతం అవుతున్న చైనా.. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన నిపుణుల్ని తనవైపు ఆర్షించే ప్రయత్నాలు చేస్తోంది. అక్టోబరులో కొత్త ఉపాధి వీసాను తీసుకొచ్చేందుకు చైనా ప్రభుత్వం. దీనిపేరు K- వీసా. చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియాకున్ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబరు 1 నుంచి K- వీసా అమలులోకి వస్తుంది. ఈ వీసా ద్వారా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకున్నవారికి చైనా ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తుంది. సహజంగా ఇలాంటి వీసాలు పొందాలంటే.. ఆయా దేశాలకు చెందిన ఉద్యోగులు, లేదా సంస్థలు ఆహ్వానం పంపించాల్సి ఉంటుంది. కానీ K- వీసా విషయంలో చైనా ఆ నియమాలను పక్కనపెట్టింది.
ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
అమెరికా వీసా ఫీజు పెంచడంతో భారత్ లోని టెకీలకు నష్టం జరిగే అవకాశం ఉంది. అమెరికా ఆశల్లో ఉన్నవారికి అది అంత సులువు కాదని తేలిపోయింది. గతంలో భారత టెకీలను అమెరికాకు పిలిపించుకుంటున్న కంపెనీలు లక్ష డాలర్ల ఫీజుతో ఆలోచనలో పడతాయి. అత్యవసరమైతే తప్ప అనామతు బ్యాచ్ ని అక్కడికి పిలిపించుకునే అవకాశమే లేదు. అమెరికా చర్యల వల్ల మేధో వలస తగ్గుతుందని, తద్వారా భారత్ కి మేలు జరుగుతుందనే వాదన కూడా వినపడుతోంది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారు. ఇక ఇలాంటి అవకాశాలకోసమే ఎదురు చూస్తున్న బ్రిటన్, చైనాలు.. భారత్ నుంచి నిపుణుల్ని తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నిటికీ కారణం అని భావిస్తున్న అమెరికా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే పరిస్థితుల్లో మళ్లీ మార్పు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ లో తయారీని ఇక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది కాబట్టి.. స్వదేశంలోనే మంచి ఉద్యోగాలను వెదుక్కునే యువత సంఖ్య కూడా పెరుగుతుంది.