Iran Protest: ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం నేపథ్యంలో ప్రారంభమైన ప్రజా నిరసనలు ఇప్పుడు పెను విప్లవంగా మారాయి. ఇరాన్ ప్రభుత్వం నిరసన కారులను అణచివేసేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడమే కాకుండా, వీధుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ, తాజా నివేదికల ప్రకారం, ఈ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 538కి చేరుకుంది, వీరిలో నిరసనకారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. సుమారు 10,670 మందిని సైన్యం అదుపులోకి తీసుకోవడంతో ఇరాన్ జైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. “ఇరాన్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది” అంటూ ఆయన చేసిన ప్రకటన పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిరసనకారులపై కాల్పులు జరపడం తక్షణమే ఆపకపోతే, అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పాలక యంత్రాంగం తమ సొంత ప్రజలపై దాడులు కొనసాగిస్తే “మేము కూడా కాల్పులు ప్రారంభించాల్సి ఉంటుంది” అని ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి.
అయితే సైనికాధికారులు ఇప్పటికే వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమై వివిధ సైనిక ప్రత్యామ్నాయాలపై చర్చించినట్లు సమాచారం. ఇందులో నేరుగా యుద్ధానికి వెళ్లకుండా, ఇరాన్ రక్షణ వ్యవస్థలోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం లేదా క్షిపణి దాడుల వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. సైబర్ దాడుల ద్వారా ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయడం, ఎలాన్ మస్క్ యొక్క ‘స్టార్లింక్’ ద్వారా అక్కడి ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం వంటి పరోక్ష పద్ధతులను కూడా అమెరికా పరిశీలిస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకోవడానికి సైన్యం మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది.
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. అమెరికా గనుక దాడికి దిగితే, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ తమ లక్ష్యంగా ఉంటాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. “అమెరికా తన సొంత ప్రయోజనాల కోసం మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది” అని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ విమర్శించారు. ఇరు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.
Also Read: విషాదం.. మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
ప్రస్తుతం ఇరాన్ వీధులు నెత్తురోడుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగితే, ట్రంప్ తన ‘రెడ్ లైన్’ దాటినట్లు భావించి సైనిక చర్యకు ఆదేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం తప్పదనే భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.