Former First Lady Jail: దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ కిమ్ కెయోన్ హీకి కోర్టు 20 నెలల జైలు శిక్ష విధించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. యూనిఫికేషన్ చర్చి అధికారుల నుండి ఖరీదైన చానెల్ (Chanel) బ్యాగులు, వజ్రాల లాకెట్టును లంచంగా స్వీకరించి, వారికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినట్లు నిర్ధారణ కావడంతో సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈ తీర్పునిచ్చింది. గతేడాది అధికార పీఠం నుంచి ఉద్వాసనకు గురైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ భార్య అయిన కిమ్, లంచం ఆరోపణల్లో దోషిగా తేలగా.. స్టాక్ ధరల తారుమారు, రాజకీయ నిధుల చట్ట ఉల్లంఘన ఆరోపణల నుండి కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది.
ఈ కేసులో కిమ్కు జైలు శిక్షతో పాటు 12.8 మిలియన్ల వోన్ల (సుమారు 8,990 డాలర్లు) జరిమానా విధించడమే కాకుండా, ఆమె స్వీకరించిన వజ్రాల హారాన్ని స్వాధీనం చేసుకోవాలని న్యాయమూర్తి ఊ ఇన్-సంగ్ నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. ప్రథమ మహిళా పదవి అనేది రాజ్యాంగపరంగా ఎటువంటి అధికారిక అధికారాలను ఇవ్వకపోయినా, అది దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక గౌరవప్రదమైన స్థానమని న్యాయమూర్తి పేర్కొన్నారు. అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా ఉండకపోయినా, కనీసం చెడు ఉదాహరణగా నిలవకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. గత ఆగస్టు నుండి కిమ్ విచారణలో భాగంగా నిర్బంధంలో ఉన్నారు.
విచారణ సమయంలో ప్రాసిక్యూటర్లు కిమ్పై ఉన్న అన్ని ఆరోపణలకు గాను 15 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా డిమాండ్ చేశారు. అయితే కొన్ని ఆరోపణల నుండి ఆమెకు విముక్తి లభించడంతో ఆమె మద్దతుదారులు కోర్టు బయట హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, నిర్దోషిగా తేలిన అంశాలపై ప్రాసిక్యూటర్లు పైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు. కిమ్ తరపు న్యాయవాదులు కోర్టు విమర్శలను వినమ్రంగా అంగీకరిస్తూ, ప్రజలకు ఆందోళన కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Also: Elephant Idol: ఇంట్లో ఏనుగు విగ్రహం పెడితే.. నిజంగానే జీవితాలు మారిపోతాయా ?