Prison Clash: శ్రీలంకలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నెగోంబో కేంద్ర కారాగారం ఒక్కసారిగా రణరంగంగా మారింది. జైలు లోపల ఉన్న ఖైదీలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు తెగబడ్డారు. పాత కక్షలు, అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న రెండు ముఠాలు శనివారం ఒక్కసారిగా ఒకరిపై ఒకరు అత్యంత ఘోరంగా దాడి చేసుకున్నాయి. కంటికి కనిపించిన వస్తువులతో, మారణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టుకోవడంతో జైలు ప్రాంగణమంతా రక్తసిక్తంగా మారింది. ఈ అల్లర్లలో ఇద్దరు ఖైదీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.
రంగంలోకి ఆర్మీ.. యుద్ధ ప్రాతిపదికన నియంత్రణ
ఖైదీల మధ్య ఘర్షణ మితిమీరిపోవడంతో జైలు సిబ్బంది పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన శ్రీలంక ప్రభుత్వం వెంటనే పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో పాటు శ్రీలంక ఆర్మీని రప్పించింది. భారీగా మోహరించిన సాయుధ బలగాలు జైలు లోపలికి దూసుకెళ్లి, తీవ్రంగా శ్రమించి అల్లరి మూకలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సుమారు 30 మంది ఖైదీలను జైలు అధికారులు అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
అల్లర్ల వెనుక ‘డ్రగ్స్’ మాఫియా హస్తం?
ఈ ఘోర కలహానికి కారాగారంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ‘డ్రగ్స్’ (మాదకద్రవ్యాల) దందానే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. జైలు లోపల డ్రగ్స్ నెట్వర్క్ను నడిపిస్తున్న ఒక శక్తివంతమైన ముఠాకు, ఆ దందాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మరో గ్రూప్నకు మధ్య కొద్దిరోజులుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి, అది కాస్తా భీకరమైన గ్యాంగ్ వార్కు దారితీసినట్లు తెలుస్తోంది. జైలు అధికారుల నిఘా కళ్లు గప్పి లోపలికి డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఈ వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భవనం పైకప్పు కూలి మరో నలుగురికి గాయాలు
రక్తపాతం సృష్టించిన గ్యాంగ్ వార్ ముగిసిన తర్వాత కూడా జైల్లో హైడ్రామా కొనసాగింది. ఈ గొడవతో సంబంధం ఉన్న మరికొందరు ఖైదీలు జైలు అధికారుల చర్యలకు నిరసనగా అక్కడి ఒక పాత భవనం పైకి ఎక్కి నినాదాలు చేయడం ప్రారంభించారు. అయితే, ఖైదీల బరువును తట్టుకోలేక ఆ పాత భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భవనంపై ఉన్న ఖైదీలలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నెగోంబో కేంద్ర కారాగారం పూర్తిగా సైన్యం ఆధీనంలో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జైలు లోపల, వెలుపల అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: అయోధ్యలో మరో ఇంజినీరింగ్ మార్వెల్.. ADA భవనంలో కూలిన మెట్లు.. తృటిలో తప్పిన ముప్పు!