Hormuz Transit Fee: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చమురు ధరలు పెరిగే అవకాశం ఉందా? హర్మూజ్ జలసంధిలో చెక్ పోస్టు ఏర్పాటు చేసి కొత్త రుసుము వసూలు చేయాలని డిసైడ్ అయ్యిందా? ఇదే విషయాలు చర్చల సందర్భంలోనూ ఇరాన్ పదే పదే గుర్తు చేసింది. తాజాగా మళ్లీ అదే పాట మొదలుపెట్టింది.
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కొత్త పన్ను
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో కొత్త పల్లవి తెరపైకి వచ్చింది. హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే వాణిజ్య నౌకలపై పన్ను వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. చైనాలో ఇరాన్ రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఘర్షణల సమయంలో ఇరాన్కు మద్దతు ఇచ్చిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చింది.
బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరాన్ రాయబారి ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్-అమెరికా మధ్య ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. వాణిజ్య నౌకలు 60 రోజుల పాటు జలసంధి ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ గడువు తర్వాత ఎలాంటి విషయాలు అమలులోకి వస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. ఇంతలోనే పన్ను విధిస్తామని చెప్పడంతో అప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
స్పష్టత ఇచ్చిన ఇరాన్.. మరి అమెరికా మాటేంటి?
బీజింగ్లో జరిగిన ప్రపంచ శాంతి వేదికలో ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ ఫజ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. కీలకమైన జలమార్గం కోసం కొత్త ఏర్పాట్లపై తమ దేశం ఒమన్తో కలిసి పని చేస్తోందని తెలిపారు. హోర్ముజ్ జలసంధి మా ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్న దేశమని గుర్తు చేశారు. తాము ఖచ్చితంగా పన్ను వసూలు చేస్తామన్నది ఇరాన్ మాట.
అలాంటి రుసుము టోల్ కావని నొక్కి వక్కానించారు. కొత్త ఏర్పాట్లపై తనదైనశైలిలో చెప్పుకొచ్చింది ఇరాన్. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణ భద్రతకు హామీ ఇవ్వడం, నౌకల రాకపోకలను పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో ఉన్న నౌకల వల్ల కలిగే పర్యావరణ పరిణామాలను నియంత్రించడం, పరిష్కరించడం వంటి వాటికి సంబంధించినవి ఉంటాయని పేర్కొన్నారు.
ALSO READ: ఒక్క దెబ్బతో అందరినీ లేపేయొచ్చు.. ఇరాన్ వీధుల్లో ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
మా పట్ల స్నేహపూర్వకంగా ఉండి కష్ట సమయాల్లో ప్రత్యేకంగా అండగా నిలిచిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ విషయాన్ని తాము ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు.జలసంధి సాధారణంగా ప్రపంచంలోని ముడి చమురు ఐదో వంతు రవాణా చేస్తుంది. యుద్ధ సమయంలో ఇరాన్ దాదాపుగా మూసివేయడంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకిన విషయం తెల్సిందే.
నౌకలపై పన్ను ఆలోచనను తిరస్కరించింది అమెరికా. అయినప్పటికీ ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. యుద్ధం సమయంలో కొన్ని నౌకల నుంచి ఇరాన్ రుసుము తీసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒక్కో షిప్ నుంచి దాదాపు 17 లక్షలు వసూలు చేసినట్టు వార్తలు గుప్పుమన్నారు. ఇప్పుడు గనుక పన్ను వసూలు చేస్తే.. ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది.