USA Telugu News: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారులే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మెట్రో సర్జ్’ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువగా ఉండే నగరాల్లో ఐసీఈ (ICE) మరియు ఫెడరల్ ఏజెంట్లు జరుపుతున్న ఆకస్మిక దాడులు, అరెస్టులు అక్కడి భారతీయ సమాజాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.
ట్రంప్ యంత్రాంగం రోజుకు కనీసం 3,000 మందిని అదుపులోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పని ప్రదేశాలు, పాఠశాలలు, చివరకు నివాసాల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నకిలీ పే గ్రీన్ కార్డులు, వీసా ఉల్లంఘనల కేసుల్లో తెలుగు వారు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో అధికారులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.
మిన్నియాపాలిస్లో స్కూల్ నుంచి వస్తున్న 5 ఏళ్ల లియామ్ (Liam) అనే బాలుడిని, అతని తండ్రిని ఐసీఈ ఏజెంట్లు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. బాలుడిని ఎరగా చూపి అతని తండ్రిని పట్టుకున్నారని స్థానిక విద్యాశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.
అమిన్నియాపాలిస్లో ఐసీఈ ఏజెంట్ల అరెస్టులను మొబైల్లో వీడియో తీస్తున్న అలెక్స్ ప్రెట్టి (Alex Pretti) అనే అమెరికన్ పౌరుడిని ఫెడరల్ ఏజెంట్లు కాల్చి చంపడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది. అతను ఒక ఐసీయూ నర్స్ మరియు మాజీ సైనికులకు సేవలు అందించే వ్యక్తి. ఈ ఘటనతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ రాయిటర్స్ నిర్వహించిన తాజా పోల్ ప్రకారం.. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలకు ప్రజల మద్దతు భారీగా తగ్గింది. గతంలో 45% ఉన్న ఆమోద రేటు ప్రస్తుతం 39%కి పడిపోయింది. దాదాపు 53% మంది ప్రజలు ఈ కఠిన విధానాలను వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం మిన్నియాపాలిస్, ఇండియా పొలిస్ వంటి నగరాల్లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఐసీఈ అరాచకాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులను ఫెడరల్ ఏజెంట్లు ఉక్కుపాదంతో అణచివేస్తుండటంతో పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.