MQ-4C Triton drone crash: హర్మూజ్ జలసంధి మీదుగా నిఘా విధుల్లో ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన అత్యంత ఖరీదైన MQ-4C Triton డ్రోన్ గల్లంతైనట్లు అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించింది. సుమారు రూ. 2,200 కోట్ల ($240 మిలియన్లు) విలువైన ఈ డ్రోన్ ఏప్రిల్ 9వ తేదీన పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కూలిపోయినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఏప్రిల్ 9న ఈ డ్రోన్ పర్షియన్ గల్ఫ్.. హర్మూజ్ జలసంధి మీదుగా తన మూడు గంటల నిఘా మిషన్ను పూర్తి చేసుకుని, ఇటలీలోని సిగోనెల్లా నేవల్ బేస్కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గగనతలంలో సుమారు 50,000 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డ్రోన్ నుండి ‘7700’ (అత్యవసర పరిస్థితి), ‘7400’ (కమ్యూనికేషన్ ఫెయిల్యూర్) సిగ్నల్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత కేవలం 15 నిమిషాల్లోనే అది 10,000 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు పడిపోయి, ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ల నుండి అదృశ్యమైంది.
అయితే, అమెరికా నేవీ దీనిని ఒక ప్రమాదంగా మాత్రమే అభివర్ణించింది. పర్షియన్ గల్ఫ్ అంతర్జాతీయ గగనతలంలో ఇది కూలిపోయిందని, ప్రాణనష్టం జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పేర్కొంది. కానీ, ఇరాన్ గతంలో (2019లో) ఇలాంటిదే ఒక గ్లోబల్ హాక్ డ్రోన్ను కూల్చివేసిన చరిత్ర ఉన్నందున, తాజా ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డ్రోన్ను ఇరాన్ క్షిపణి దాడుల ద్వారా కూల్చివేసిందనే ప్రచారం అంతర్జాతీయ మీడియాలో బలంగా వినిపిస్తోంది.
ఎంక్యూ-4సీ ట్రైటాన్ అనేది అమెరికా వద్ద ఉన్న అత్యంత అరుదైన, అధునాతన నిఘా డ్రోన్. అమెరికా నౌకాదళం వద్ద ఇలాంటివి కేవలం 20 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో డ్రోన్ తయారీకి సుమారు 240 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 2,200 కోట్లు) ఖర్చవుతుంది. ఇది 24 గంటల పాటు నిరంతరాయంగా గగనతలంలో ఉంటూ సముద్రంలోని నౌకల కదలికలను క్షుణ్ణంగా పర్యవేక్షించగలదు. అగ్రరాజ్యం చమురు రవాణా మార్గమైన హర్మూజ్పై పట్టు కోసం దీనిని వాడుతుండగా, ఇలాంటి కీలకమైన డ్రోన్ను కోల్పోవడం అమెరికాకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు.
Read Also: ట్రంప్ నెక్ట్స్ టార్గెట్ మలక్కా జలసంధి.. చైనాకు చెక్ పెట్టేందుకు పావులు, ఇండియా కీ రోల్ తప్పదా?