ఆమధ్య పాకిస్తాన్ లో చమురు అన్వేషణకు కీలక ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్ వార్నింగ్ తో ఆ వ్యవహారం కాస్త ఆలస్యమైంది. అయితే తాజాగా పాక్ లో కీలకమైన ఖనిజాల వెలికితీతకు అమెరికా ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO), అమెరికాలోని యుఎస్ స్ట్రాటజిక్ మెటల్స్(USSM) మధ్య ఒక అవగాహన ఒప్పందం(MOU) కుదిరిందని పాకిస్తాన్లోని యుఎస్ రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రధానమంత్రి నివాసంలో ఇరు సంస్థల ప్రతినిధి బృందాలు ఎంఓయూపై సంతకాలు చేసినట్టు తెలిపారు. యుఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM) నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జాచ్ హార్కెన్రైడర్ వెళ్లారు.
ఒప్పందం సారాంశం ఏంటి?
USSM అనేది మిస్సోరిలోని ఖనిజాన్వేషణ సంస్థ. కోబాల్ట్, నికెల్, రాగి, లిథియం వంటి కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడానికి, రీసైక్లింగ్ చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ ఖనిజాలను US ఇంధన శాఖ, ఇంధన ఉత్పత్తికి సంబంధించిన వివిధ సాంకేతిక పరిజ్ఞానాలలో వినియోగిస్తారు. అమెరికా భద్రతకు ఇవి కీలకమైన ఖనిజాలు కావడంతో ప్రపంచంలో ఏ మూల ఉన్నా వీటిని వెలికి తీసేందుకు ఆయా దేశాలతో USSM ఒప్పందాలు చేసుకుంటుంది. తాజాగా పాకిస్తాన్ తో కూడా ఇలాగే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అమెరికా-పాకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలపరుస్తుందని, రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు.
ఈనాటి ఈ బంధం..
అమెరికా, పాకిస్తాన్ మధ్య ఇటీవల బంధం బలమవుతున్నట్టుగా స్పష్టమవుతోంది. అమెరికాతో పాకిస్తాన్ ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం అమెరికా పరస్పర సుంకాలను తగ్గించేందుకు అంగీకరించడం విశేషం. అమెరికా, పాకిస్తాన్.. భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయని ఆమధ్య ట్రంప్ కూడా ప్రకటించారు. ఓవైపు భారత్ పై భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్, అటు పాకిస్తాన్ పై మాత్రం ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. సుంకాల భారాన్ని తగ్గించి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
భారత్ పై ప్రతీకారం కోసమేనా..?
గత నెలలో భారత్, రష్యా మధ్య కీలకమైన ఖనిజాల వెలికితీత, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ వ్యవహారంలో కీలక ఒప్పందం కుదిరింది. ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనలో అవకాశాలను అణ్వేషిస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. భారత్-రష్యా చెలిమి సహజంగానే అమెరికాకు మంటపెట్టింది. రోజుల వ్యవధిలోనే అగ్ర రాజ్యం పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకోవడం, అది కూడా ఖనిజాల వెలికితీతపైనే కావడం మరింత ఆసక్తి కలిగించే అంశం. అమెరికా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ, భారత్ ప్రత్యామ్నాయల వేటలో పడింది. అటు రష్యాతో మైత్రిని కొనసాగిస్తూనే ఇటు చైనా స్నేహ హస్తం కోసం ఎదురు చూస్తోంది. ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా భారత్ తో వాణిజ్య మైత్రిని ఆశిస్తున్నాయి. ఇటీవల రష్యా-చైనా-భారత్ దేశాధినేతల కలయిక ఇతర ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారింది. ముఖ్యంగా అమెరికా ఈ కలయికను సహించలేకపోతోంది. రష్యాతో వాణిజ్య బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలంటూ అమెరికా ఆంక్షలు విధిస్తున్న వేళ, ఆ హెచ్చరికల్ని భారత్ లెక్కచేయకపోగా మరింత దూకుడుగా వ్యవహరిస్తుండటం విశేషం. దీంతో అమెరికా కూడా భారత్ శత్రువు పాక్ ని ప్రోత్సహించేందుకు సిద్ధపడింది. పరోక్షంగా భారత్ పై ఒత్తిడి తేవాలనుకుంటోంది.