Jobs In McDonald’s: హైదరాబాద్ నగరం గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఐటీ, ఫార్మా, ఫుడ్, టెక్నాలజీ రంగాల్లో అత్యుత్తమ వేదికగా ఎదుగుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరింది ప్రపంచ ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ చైన్ – మెక్డొనాల్డ్స్. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ, హైదరాబాద్లో గ్లోబల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎలాంటి సాధారణ కార్యాలయం కాదు. ఇది సంస్థకు టెక్నాలజీ పరంగా మద్దతునిచ్చే, ఆపరేషన్స్కి నడిపే, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేసే ఒక కీలక కేంద్రంగా మారబోతోంది.
సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో టెక్నికల్ టీమ్
ఇప్పుడు సంస్థ దగ్గర సుమారు 100 మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. కానీ మెక్డొనాల్డ్స్ అంచనా ప్రకారం ఈ ఏడాది ముగిసేలోగా ఈ సంఖ్య 500కి చేరుతుంది. మరో రెండు సంవత్సరాల్లో, అంటే 2027 ప్రారంభానికి ఇది 2,000 మందికి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల హైదరాబాద్లో భారీగా టెక్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇతర మల్టీనేషనల్ కంపెనీల మాదిరిగానే, మెక్డొనాల్డ్స్ కూడా హైదరాబాద్ను తమ వ్యూహాత్మక కేంద్రంగా ఎన్నుకుంది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 40 వేల రెస్టారెంట్లను డిజిటల్గా కనెక్ట్ చేసే పథకంపై పనిచేస్తోంది. డేటా గవర్నెన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా ఇన్సైట్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో టెక్నికల్ టీమ్లు ఇక్కడే పనిచేయబోతున్నాయి.
ఇంకొంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – మెక్డొనాల్డ్స్ ఇప్పటికీ కొన్ని దేశాల్లో డిజిటల్ సేవలు పూర్తిగా సమన్వయం కావడం లేదు. ఉదాహరణకి, మీరు భారత్లో వాడే మెక్డొనాల్డ్స్ యాప్ను అమెరికాలో వాడలేరు. అందుకే ఇప్పుడు ఒకే యాప్ – ప్రపంచవ్యాప్తంగా పనిచేసే యూనిఫైడ్ యాప్ను రూపొందించేందుకు వారు భారీగా పెట్టుబడి పెట్టుతున్నారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ కోడ్ వ్రాయడం మాత్రమే కాదు – ఇందులో డేటా ప్రాసెసింగ్, కస్టమర్ బిహేవియర్ విశ్లేషణ, వ్యక్తిగతీకరణ ఆఫర్లు రూపొందించడం వంటి అనేక పక్రియలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ యాప్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ పనులు జరుగుతున్నాయి. తద్వారా మెక్డొనాల్డ్స్ వినియోగదారులకు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఒకే విధంగా సేవలు అందించగలుగుతుంది. దీని ద్వారా కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభూతి, విశ్వాసం, లాయల్టీ ప్రోగ్రామ్స్ వంటి అనేక ప్రయోజనాలు లభించనున్నాయి.
కస్టమర్కి నాణ్యత కలిగిన ఫుడ్
ఇక మరో ప్రాజెక్ట్ విషయానికి వస్తే – ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 400 రెస్టారెంట్లలో మెక్డొనాల్డ్స్ ‘ఎడ్జ్ AI’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా విజన్ కెమెరాలు ఆర్డర్ తయారీ సమయంలో తగిన పదార్థాలు వేయబడ్డాయా లేదా అన్నది తనిఖీ చేస్తాయి. ఉదాహరణకి – మీరు బర్గర్ ఆర్డర్ చేస్తే అందులో పెటీ, చీజ్, సాస్ వగైరా సరిగ్గా ఉన్నాయా అనే విషయం ఈ కెమెరాలు నిర్ణయిస్తాయి. ఎటువంటి పొరపాట్లూ లేకుండా, కస్టమర్కి నాణ్యత కలిగిన ఫుడ్ అందించడమే లక్ష్యం.
ఈ విధంగా మెక్డొనాల్డ్స్ ఇప్పుడు టెక్నాలజీ పరంగా పూర్తిగా రూపాంతరం చెందుతోంది. వారు ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న మరో పెద్ద ప్రయోగం – ఇంటర్నెట్-కనెక్టెడ్ కిచెన్. దీనివల్ల ప్రపంచంలోని అన్ని రెస్టారెంట్ల వంటగదులు ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ మీద పనిచేయగలవు. ఎక్కడ ఏ డిమాండ్ పెరుగుతోంది, ఎక్కడ ఏ పదార్థాలు తక్కువగా ఉన్నాయి, డెలివరీ సమయంలో ఎంత ఆలస్యం జరుగుతోంది వంటి సమాచారాన్ని లైవ్గా ట్రాక్ చేయవచ్చు.
టెక్ రంగానికి కొత్త ఊపిరి
ఇలాంటి పరిణామాలు హైదరాబాద్ టెక్ రంగానికి ఓ కొత్త ఊపిరి తీసుకొస్తున్నాయి. ఇది కేవలం ఉద్యోగావకాశాల విషయమే కాదు – cutting-edge టెక్నాలజీపై పని చేసే అవకాశం. అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేసే మల్టినేషనల్ సంస్థలో, భారత్లోనే ఉండి ప్రపంచానికి పనిచేయగల సామర్థ్యం – ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ యువతకు చేరువ అవుతున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్కి సంస్థ సుమారు $100 మిలియన్ డాలర్లు – అంటే దాదాపు రూ. 875 కోట్లు – ఖర్చు పెట్టనుంది. ఇది మెక్డొనాల్డ్స్ ఇండియాలో చేసిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలవబోతోంది. మొత్తానికి చెప్పాలంటే… బర్గర్ల వ్యాపారాన్ని బలంగా నడిపిన మెక్డొనాల్డ్స్, ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలోనూ తమ పట్టు చూపించేందుకు సిద్ధమవుతోంది. అది కూడా మన హైదరాబాద్ నుంచే.