Hyderabad: తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు ముందు విద్యార్థులకు చల్లని వార్త. కొత్తగా 15 వేల బీటెక్ సీట్లు పెరగనున్నాయి. దీనికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఆమోదం తెలిపింది. ఈ విషయం తెలియగానే పలు కాలేజీలు ఆయా సీట్లను తమకు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది. దీనిపై రేపు మాపో నిర్ణయం తీసుకోనుంది రేవంత్ సర్కార్.
తెలంగాణలో శుక్రవారం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
బీటెక్లో జాయిన్ అయ్యేందుకు ఎంట్రన్స్ ఫలితాలు వచ్చేశాయి. జూన్ 19 అనగా శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి-ఏఐసీటీఈ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి మరో 15 వేల సీట్లు మంజూరు చేసింది.
ప్రస్తుతం తెలంగాణలో కన్వీనర్, యాజమాన్యం కోటా కింద లక్షా 25 వేలకు పైగానే సీట్లు ఉన్నాయి. ఈ 15 వేల సీట్లతో ఆ సంఖ్య లక్షా 40 వేలకు చేరనుంది. పెంచిన సీట్లకు తెలంగాణ ప్రభుత్వంఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుంది. 15 వేల సీట్లను తమకు కేటాయించాలని ఇప్పటికే వివిధ ఇంజనీరింగ్ కాలేజీ ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించారు.
15 వేల సీట్లు పెంపు, అందరి చూపు సీఈసీపైనే
దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాలకు సంబందించి బ్రాంచ్ ల్లో 70 శాతం సీట్లు ఉన్నాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు కోర్ బ్రాంచ్లకు డిమాండ్ పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 15 వేల సీట్లు ఏయే విభాగాల్లో పెంపు అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుండగా సాంకేతిక విద్యా శాఖ.. ఏయే కాలేజీలు అదనపు సీట్లు కోరుతున్నాయి అనే జాబితాను రేపో మాపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనుంది. దాని తర్వాత ఆయా సీట్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది. కొత్తగా సీట్లు కేటాయించే నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఆయా కాలేజీల్లో మరోసారి తనిఖీలు చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: పిల్లల చదువుల కోసం.. ష్యూరిటీ లేకుండా రూ.7.50 లక్షల లోన్, ఆ స్కీమ్ ఏంటో తెలుసా?
సీట్లకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ల్యాబ్ వంటి సదుపాయాలు ఉంటేనే కేటాయించాలని ఆలోచన చేస్తున్నట్లు సదరు వర్గాలు అంటున్నాయి. గతేడాది కూడా బీటెక్ రెండో విడత కౌన్సెలింగ్ సమయంలో ప్రభుత్వం దాదాపు 7600 సీట్లను ప్రభుత్వం పెంచిందని, ఇప్పుడు అదే పద్దతి ఫాలో కావచ్చని అంటున్నారు. మొత్తానికి ఇంజనీరింగ్ విభాగంలో సీట్లు పెంపు విద్యార్థులకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు.