సీబీఎస్ఈ స్టూడెంట్స్ కు బిగ్ అలెర్ట్. కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE) 12వ తరగతి ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను మే నెల మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇప్పటికే పదో తరగతి ఫలితాలను విజయవంతంగా ప్రకటించిన బోర్డు.. ప్రస్తుతం ఇంటర్మీడియట్ స్థాయి ఫలితాల క్రోడీకరణలో నిమగ్నమై ఉంది. ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఈ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 10 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిశాయి.
తొలిసారి.. ఆన్-స్క్రీన్ మార్కింగ్
ఈ ఏడాది బోర్డు ఒక కీలకమైన సంస్కరణను ప్రవేశపెట్టింది. సమాధాన పత్రాల దిద్దుబాటు ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) విధానాన్ని తొలిసారిగా అమలులోకి తెచ్చింది. ఈ డిజిటల్ మూల్యాంకన పద్ధతి వల్ల మానవ తప్పిదాలకు తావుండదు. ఫలితాల ప్రాసెసింగ్ వేగంగా పూర్తవుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మార్కులను నమోదు చేయడం వల్ల జాప్యం తగ్గుతుంది. గతేడాది మే 13వ తేదీనే ఫలితాలు వచ్చిన నేపథ్యంలో.. ఈసారి కూడా అదే సమయానికి రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు అనుసరించాల్సిన నిబంధనలను బోర్డు స్పష్టంగా వివరించింది. థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లోనూ విడివిడిగా 33 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. వీటితో పాటు ఓవరాల్గా కూడా కనీసం 33 శాతం మార్కులు పొందితేనే విద్యార్థిని ఉత్తీర్ణుడిగా పరిగణిస్తారు. ఒకవేళ ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే.. ఇంప్రూవ్మెంట్ లేదా కంపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని బోర్డు కల్పిస్తుంది.
ఉమాంగ్ యాప్ ద్వారా మెమో..!
ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు తమ మార్కుల జాబితాను అధికారిక వెబ్సైట్ results.cbse.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. వెబ్సైట్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా బోర్డు సూచించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉమాంగ్ (UMANG) యాప్ లేదా డిజిలాకర్ (DigiLocker) ఖాతాల ద్వారా కూడా విద్యార్థులు తమ డిజిటల్ మార్క్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు ముందుగానే తమ డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వార్షిక పరీక్షల నిర్వహణలో ఈసారి బోర్డు అత్యంత కఠినమైన నిబంధనలను పాటించింది. పేపర్ లీకేజీలకు తావులేకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనుసరించిన ప్రణాళికాబద్ధమైన చర్యల వల్ల ఫలితాల వెల్లడి ప్రక్రియ సజావుగా సాగుతోంది. మే మూడో వారంలోగా తుది ఫలితాలను సిద్ధం చేసి అధికారిక ప్రకటన వెలువరిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి.
ALSO READ: తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!