Congress Posts: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో అధికారంలోకి వచ్చి పట్టు బిగిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్న వారు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచి జెండా మోసిన ‘అసలు సిసలు’ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించేందుకు హైకమాండ్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి వివరాలు కోరడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
టీపీసీసీ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా కొందరు నేతల వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. గత పదేళ్లుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నేతల జాబితాను ఆయన పరిశీలిస్తున్నారు. కేవలం పైరవీలతో కాకుండా, క్షేత్రస్థాయిలో పనితీరు ఆధారంగానే పదవులు ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also read: KA Paul: తెలంగాణను ముంచడానికే కవిత పార్టీ.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో సామాజిక సమీకరణలతో పాటు ‘ఉద్యమ కోటా’కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.డీసీసీ అధ్యక్ష పదవుల్లోనూ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
రాహుల్ గాంధీ స్వయంగా ఆరా తీస్తుండటంతో, ఎవరికి ఏ పదవి దక్కుతుందో అన్న ఉత్కంఠ పార్టీలో నెలకొంది. ముఖ్యంగా గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఈసారి పెద్దపీట వేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
”పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తలకు, ఉద్యమకారులకు అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పిస్తాం.” అని టీ పీసీసీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో మే నెల ‘పదవుల మాసం’ కాబోతోంది. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇది పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read: చారిత్రక కట్టడాల పరిరక్షణలో తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రయోగం..!