CBSE Inter OSM Controversy: సీబీఎస్ఈ ఇంటర్ ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదంపై ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓఎస్ఎం వ్యత్యాసాలు-విద్యార్థుల అసౌకర్యానికి తాను బాధ్యత వహిస్తానని తేల్చిచెప్పారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే సమయంలో విద్యార్థులపై ఒత్తిడిని పెంచవద్దని రాజకీయ పార్టీలను కోరారు ఆయన.
సీబీఎస్ఈ ఇంటర్లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం
ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ ఇంటర్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థపై ఇంటా బయటా ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ విధానం వల్ల తమ జవాబు పత్రాలు తారుమారయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు. అంతేకాదు సీబీఎస్ఈ తీరుపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం హెఆర్డీ మంత్రి ధర్మేంద్రప్రధాన్ నోరు విప్పారు.
జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియలో ఒకవేళ అవకతవకలు జరిగినట్లు తేలితే బాధ్యులను వదిలిపెట్టబోమన్నారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఈ వైఫల్యాలకు తాను బాధ్యత తీసుకుంటున్నట్లు తెలియజేశారు. తలెత్తిన సమస్యను సరి చేస్తామని, పరిష్కారాలను కనుగొంటామన్నారు. ఇప్పుడు అధికారులు ఆ పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు.
ఆ బాధ్యత నాదేనన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
గురువారం ఢిల్లీలో సీబీఎస్ఈ బోర్డు అధికారులతో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 98 లక్షల సమాధాన పత్రాల కాపీలను ఆన్లైన్లో ఉంచామన్న మంత్రి, ఒక్కో జవాబు పత్రంలో 40 పేజీలు ఉంటాయని వివరించారు. ఆ లెక్కన 40 కోట్ల కాపీలను స్కాన్ చేశామన్నారు. పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థులకు చెందిన 98 లక్షల జవాబు పత్రాలను భద్రంగా ఉంచామన్నారు.
ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానం ఒక ముందడుగుగా ఆయన వర్ణించారు. అంతర్జాతీయంగా ఈ పద్దతిని చాలా దేశాలు వినియోగిస్తున్నాయని గుర్తు చేశారు. ఇది విద్యార్థుల కోసం తీసుకువచ్చామని, మార్కుల గురించి పారదర్శక సమాచారం అందించేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థను కొందరు వ్యతిరేకిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు సదరు మంత్రి.
రాజకీయాలు తర్వాత చేయవచ్చని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగకుండా చూడటమే ముఖ్యమైన విషయమని తేల్చేశారు. మార్కులు, వెరిఫికేషన్, రీ వ్యాల్యుయేషన్ వంటి అంశాలతో ఆందోళనకు గురవుతున్న విద్యార్థులపై మరింత ఒత్తిడి పెంచేలా బహిరంగ ప్రకటనలు చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.