ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. సీఆర్పీఎఫ్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ టెక్నికల్ అలాగే ట్రేడ్స్మెన్ విభాగాలతో పాటు పయనీర్ విభాగాలోని ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,212 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. నిరుద్యోగ యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9212
విభాగాల వారీగా..: మొత్తం ఖాళీలలో టెక్నికల్ ట్రేడ్స్మెన్ విభాగానికి అత్యధికంగా 9,195 పోస్టులు కేటాయించారు. ఇందులో పురుష అభ్యర్థులకు 9,103 స్థానాలు ఉండగా మహిళా అభ్యర్థులకు 92 స్థానాలు ఉన్నాయి. పయనీర్ విభాగంలో 17 ఖాళీలు భర్తీ కానున్నాయి. డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కుక్, కార్పెంటర్, టెయిలర్, బార్బర్, సఫాయీ కర్మచారి వంటి అనేక ట్రేడ్స్లో ఈ నియామకాలు జరుగుతున్నాయి.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు సంబంధిత ట్రేడ్లలో సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి.
వయస్సు: డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు 21 నుండి 27 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వీరు 02/01/1999 కంటే ముందుగానీ 01/01/2005 తర్వాత గానీ జన్మించి ఉండకూడదు. ఇతర ట్రేడ్స్ అభ్యర్థులకు 18 నుండి 23 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించారు. వీరు 02/01/2003 నుంచి 01/01/2008 మధ్య జన్మించిన వారై ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 విధానంలో నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు వేతనం అందుతుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు ఏప్రిల్ 20, 2026 నుండి ప్రారంభమవుతాయి. ఆసక్తి గలవారు మే 19, 2026 లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులతో పాటు మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు పలు దశల పరీక్షలు ఎదుర్కోవాలి. తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST) ఉంటాయి.
అనంతరం సంబంధిత ట్రేడ్లో నైపుణ్యాన్ని పరీక్షించే ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జాబితా రూపొందిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://rect.crpf.gov.in/
ALSO READ: తెలంగాణ ఇంటర్ ఫలితాలు-2026.. ఆ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం, విద్యార్థుల్లో కొత్త టెన్షన్