JEE Advanced Exam Today: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో చేరే విద్యార్థులకు అసలైన పరీక్ష మొదలైంది. ఇందుకోసం విద్యార్థులు జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష ఆదివారం(మే 17న) రాస్తున్నారు. ఈ పరీక్షకు దాదాపు 2 లక్షల మంది పోటీ పడుతున్నారు. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ ఒకటిన విడుదల కానున్నాయి. ఆ తర్వాత జోసా ద్వారా కౌన్సెలింగ్ జరగనుంది.
ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష
దేశవ్యాప్తంగా ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. అడ్వాన్స్డ్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ సీట్లను భర్తీ చేయనున్నారు. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన దాదాపు రెండు లక్షల మంది మాత్రమే అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత సాధించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష-CBT విధానంలో ఈ పరీక్ష జరగనుంది. మొత్తం రెండు షిఫ్టులలో పరీక్ష జరుగుతుంది, ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్- 1 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 వరకు జరుగుతుంది.
జేఈఈ అడ్వాన్సుడ్ నేడు పరీక్ష.. దాదాపు లక్షా 80 వేల మంది హాజరు
అధికారిక సూచనల ప్రకారం.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రిపోర్టింగ్ సమయం, డ్రెస్ కోడ్, పరీక్షా కేంద్రానికి తీసుకు రావలసిన పత్రాలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల లోపలికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పెన్నుల వంటి పరికరాలు నిషిద్ధం.
చేతితో రాసిన కాగితాలు, పర్సులు, హ్యాండ్బ్యాగులు, లోహపు ఆభరణాలు, జామెట్రీ బాక్సులను నిషేధించారు అధికారులు. అభ్యర్థులు సాదా సీదాగా ఉండే దుస్తులు ధరించాలి. చెప్పులు, శాండిల్స్ పాదరక్షలకు అనుమతి ఉంటుంది. మతపరమైన చిహ్నాలను ధరించిన వారు తనిఖీల కోసం ముందుగా హాజరు కావాలని కోరారు.
ALSO READ: నీట్ ఎగ్జామ్పై ఎన్టీఏ-కేంద్ర మంత్రి ప్రకటన.. జూన్ 21న పరీక్ష, విద్యార్థుల్లో కొత్త టెన్షన్
ఐఐటీలలో విద్యార్థులకు ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది ఈ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించగా, ఈసారి ఐఐటీ రూర్కీ బాధ్యతలు తీసుకుంది. గతేడాది బాలికల ఉత్తీర్ణత శాతం 22.7 శాతం నమోదు అయ్యింది. ఈ పరీక్షకు మొత్తం 41,337 మంది బాలికలు హాజరయ్యారు. అందులో 9,404 మంది అర్హత సాధించారు. పురుషులు 1,39,085 మంది పరీక్ష రాయగా, వారిలో 44,974 మంది ఉత్తీర్ణత సాధించారు.
అడ్వాన్స్డ్లో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కుల ఆధారంగా దాదాపు 54 వేల మందికి జోసా కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అర్హత కల్పించారు. గతేడాది 18,160 ఐఐటీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మరో 300 పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తొలిసారి బెంగళూరులోని ఐఐఎస్సీ జోసా కౌన్సెలింగ్లో చేరింది. జూన్ 2 నుంచి జోసా కౌన్సెలింగ్ మొదలుకానుంది. జులై 24 వరకు కొనసాగుతుంది.