తెలంగాణ అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల్లో తమ సత్తా చాటారు. కఠోర శ్రమను నమ్ముకున్న గ్రామీణ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్ర కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారు. ముఖ్యంగా పేద నేపథ్యం కలిగిన అభ్యర్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక హోదాలకు ఎంపికయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం ఈ అభ్యర్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించింది. సివిల్స్ సాధించాలనే బలమైన ఆకాంక్ష ఉన్నా.. ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడేవారికి ఈ పథకం కొండంత అండగా నిలిచింది. సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన 202 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది.
ఈ ఆర్థిక భరోసాతో అభ్యర్థులు పుస్తకాలు, కోచింగ్ ఇతర ఖర్చుల ఆందోళన లేకుండా ఏకాగ్రతతో చదివారు. ప్రభుత్వం అందించిన ఈ సాయం అందుకున్న వారిలో 51 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ దశకు చేరుకున్నారు. తుది ఫలితాల్లో వీరిలో 20 మంది విజేతలుగా నిలిచి సివిల్ సర్వెంట్లుగా ఎంపిక కావడం విశేషం. ప్రభుత్వం కల్పించిన చేయూత ఫలితాలను ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
విజయకేతనం ఎగురవేసిన అభ్యర్థులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సివిల్స్ సాధించడం గర్వకారణమని ఆయన కొనియాడారు. కష్టపడి చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఈ విజయం భవిష్యత్తులో సివిల్స్ రాయబోయే మరికొందరికి స్ఫూర్తినిస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ALSO READ: IDBI Recruitment: డిగ్రీ అర్హతతో 1300 ఉద్యోగాలు.. మంచి వేతనం, డోంట్ మిస్