NEET-UG-2026 Re-Test: దేశవ్యాప్తంగా నీట్ యూజీ-2026 రీఎగ్జామినేషన్కు సర్వం సిద్ధమైంది. మరో రెండు వారాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది ఎన్టీఏ. పేపర్ తయారు చేసే నిపుణుల నుంచి మొదలు, ఎగ్జామ్ జరిగే ప్రతీ సెంటర్ వరకు ఏ మాత్రం తేడా రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈసారి ఎగ్జామ్ ప్రశ్న పత్రాల తయారీ చేసిన నిపుణులను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు తెలుస్తోంది.
నీట్ రీఎగ్జామ్.. రహస్య ప్రాంతంలో పేపర్ తయారీ నిఫుణులు
దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ రెండువారాల్లో జరగనుంది. ఈ పరీక్ష కోసం పక్కాగా ప్లాన్ చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రీ-టెస్ట్ నిర్వహణ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. పేపర్ తయారీ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అంతేకాదు రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాల తయారు చేసిన నిపుణులను రహస్య ప్రదేశంలో ఉంచినట్లు తెలుస్తోంది. జూన్ 21న పరీక్ష పూర్తి అయ్యేవరకు నిఫుణులు దూరంగా ఉంచినట్టు చెబుతున్నాయి. పేపర్ తయారు చేసిన నిపుణులు, దాని పర్యవేక్షకులు, ట్రాన్స్లేటర్లు సహా భాగస్వాములైన ప్రతిఒక్కరినీ అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది.
జూన్ 21 వరకు అత్యంత భద్రత ప్రాంతంలో నిపుణులు
వారి భద్రతా అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంచడమే కాకుండా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచీలు, కమ్యూనికేషన్ పరికరాలు అందుబాటులో లేకుండా చేసినట్టు తెలుస్తోంది. ఈ రెండువారాలు వారంతా కనీసం ఫ్యామిలీకి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అనుమతి పొందిన సిబ్బందిని ఈ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పిస్తున్నారట.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ పూర్తి అయ్యేవరకు వారికి లాక్డౌన్లో ఉంచినట్టు ప్రచారం సాగుతోంది. నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం కారణంగా మే నెలలో నిర్వహించిన పరీక్ష రద్దు అయ్యింది. దీనికారణంగా దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది ఎన్టీఏ.
ALSO READ: పాఠశాలల విద్యార్థులకు కలిసొచ్చింది.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే..
గత పరీక్షల సమయంలో గుర్తించిన అన్ని లోపాలను సరిదిద్ది నిష్పక్షపాతంగా మళ్లీ పరీక్ష జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్తోపాటు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.
మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను రెడీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. పేపర్ తయారీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజీ, రవాణా, పంపిణీ వరకు అన్నిదశల్లో భారీ భద్రతాను అమలుచేస్తున్నారు. అంతేకాదు పేపర్ రవాణా కోసం వాయుసేనకు చెందిన విమానాలను వినియోగించాలని భావిస్తున్నారు. అధునాతన డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ, సురక్షిత రవాణా పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో తప్పుడు లీకేజీ కథనాలపై సైబర్ క్రైమ్ విభాగాలు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.