ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016లో ప్రారంభమైన ఈ అంతర్జాతీయ సదస్సుకు 110 దేశాల నుంచి సుమారు 2700 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వేదికపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం లభించడం ఇదే తొలిసారి. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా పలువురు అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో ఆయన ప్రసంగించారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. సాంకేతికత రంగంలో అగ్రగామిగా మారుతోందని సీఎం స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల క్రితం తాము చేపట్టిన ఐటీ విప్లవం నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు నిపుణులను నిలబెట్టిందని ఆయన గుర్తు చేశారు.
నాలెడ్జ్ ఎకానమీలో భారత్ కీలక భాగస్వామిగా ఉందని చంద్రబాబు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (GCCs) 60 శాతం భారత్లోనే ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. భవిష్యత్తు సాంకేతికత అయిన క్వాంటం కంప్యూటింగ్కు అమరావతిని వేదికగా మారుస్తున్నట్లు ప్రకటించారు. అమరావతిని “క్వాంటం వ్యాలీ”గా తీర్చిదిద్ది.. త్వరలోనే ఇక్కడ క్వాంటం పరికరాలను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచ గమనాన్ని మార్చబోతోందని.. సైబరాబాద్ తరహాలోనే అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
గతంలో భారతీయ మేధావులు సిలికాన్ వ్యాలీకి తరలి వెళ్లగా.. ఇకపై రివర్స్ మైగ్రేషన్ ప్రారంభం కాబోతోందని సీఎం విశ్లేషించారు. నిపుణులు ఉన్న చోటుకే అవకాశాలు వస్తున్నాయని.. ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు పెరిగిందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ ఏపీ దూసుకుపోతోందని.. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తితో పాటు విద్యుత్ ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ స్థాయి నాయకత్వాన్ని తయారు చేస్తామన్నారు. 9 రకాల కాన్సెప్ట్ నగరాలతో అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.
దేశంలో పెరుగుతున్న ఏజింగ్ (వృద్ధాప్య) సమస్యపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జనాభా నియంత్రణ గురించి మాట్లాడిన తాను.. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీలో ఫెర్టిలిటీ రేటును 1.5 నుంచి 2.1కి పెంచేలా ప్రోత్సాహకాలు ప్రకటించారు. మూడో బిడ్డ పుడితే 25 వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు.. నెలకు వెయ్యి రూపాయల చొప్పున అందిస్తామని వెల్లడించారు. చిన్న కుటుంబాలుగా మారుతున్న వ్యవస్థను మళ్ళీ ఉమ్మడి కుటుంబాల దిశగా మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డ్రోన్ అంబులెన్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలు త్వరలోనే వాస్తవరూపం దాలుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ALSO READ: Harish Rao: రేవంత్ రెడ్డి కర్ణుడు కాదు.. మహా క్రూరుడు, హరీశ్ రావు సంచలన విమర్శలు