సీఎం రేవంత్ రెడ్డి తనను తాను కర్ణుడితో పోల్చుకోవడం హాస్యాస్పదమని.. ఆయన కర్ణుడు కాదు మహా క్రూరుడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి భారీగా తరలివచ్చిన నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సమావేశానికి ముందు మల్కాపూర్, గోపాలరావుపల్లి గ్రామాల్లో పర్యటించిన హరీశ్ రావు.. ఎండిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగిందని.. నేడు రేవంత్ పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్గా మారిందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో, మూసీ సుందరీకరణ నెపంతో పేదల ఇళ్లను కూలగొడుతూ వారి బతుకులను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. కట్టడం చేతకాని రేవంత్ రెడ్డికి కూల్చే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
కర్ణుడు అంటే మాట తప్పని వాడని.. తన కవచ కుండలాలను దానం చేసిన త్యాగధనుడని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి పేదల కడుపు కొట్టే దుర్మార్గుడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చుతుంటే బందోబస్తుకు వెళ్లిన ఎస్సై సైతం కన్నీరు పెట్టుకున్నాడని.. ముఖ్యమంత్రికి మాత్రం కనికరం లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా సకాలంలో అందేవని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ వచ్చాక మూడు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టి రైతులను బిచ్చగాళ్లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజంగా ముఖ్యమంత్రి కర్ణుడివే అయితే రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని.. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల సమయంలోనే నిద్రలేచే కుంభకర్ణుడు అని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ జరిగిందో లేదో తెలియదనడం ముఖ్యమంత్రి హోదాకు తగదని.. ఆయన సీఎంగా ఉన్నారా లేక చప్రాసీలా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గారు గొర్రెలు, చేప పిల్లలు, దళితబంధు ఇచ్చి కులవృత్తులను ఆదుకున్నారని.. గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీసీల కోసం వందల గురుకులాలు ఏర్పాటు చేశారని కొనియాడారు. కాంగ్రెస్ రాగానే వాటన్నింటికీ మంగళం పాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
99 రోజుల ప్రణాళిక అంటూ రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరతీశారని.. అది బాటా చెప్పుల రేటులా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రచారాల కోసం కేరళ పత్రికలకు కోట్లు ఖర్చు చేస్తున్నారని.. వందల కోట్లతో సీఎం క్యాంపు ఆఫీసు కట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల బిల్లుల కోసం రూ. 30 వేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి.. రైతులు, పెన్షనర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. దమ్ముంటే గన్ మెన్లు లేకుండా గ్రామాల్లోకి రావాలని.. రైతులు తిరగబడటం ఖాయమని హరీశ్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.