Judicial Shock to Gudivada Amarnath: విశాఖపట్నం రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు షాక్ ఇచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి ఒక పాత కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ విశాఖ ఎడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
2016 ఏప్రిల్ 17న విశాఖపట్నంకు ప్రత్యేక రైల్వే జోన్ సాధించాలనే డిమాండ్తో గుడివాడ అమర్నాథ్ జీవీఎంసీ (GVMC) గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఆ సమయంలో ఆయన ప్రాణాలకు హాని కలిగించుకునేలా ఆత్మహత్యాయత్నం చేస్తున్నారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సుదీర్ఘ కాలంగా విచారణ సాగగా.. తాజాగా మేజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పును వెలువరించారు.
కోర్టు విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో గుడివాడ అమర్నాథ్కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు మేజిస్ట్రేట్ ప్రకటించారు. జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించారు. మాజీ మంత్రికి జైలు శిక్ష పడటం విశాఖ వైఎస్సార్సీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించిన వెంటనే గుడివాడ అమర్నాథ్ తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ఈ తీర్పుపై తాము జిల్లా కోర్టులో లేదా పైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ పోరాటంలో భాగంగా చేసిన దీక్షపై ఇటువంటి శిక్ష పడటం పట్ల ఆయన వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి న్యాయ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయనకు బెయిల్ పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: నియోజకవర్గాల పునర్విభజనతో యూపీకి లాభం.. సౌత్ కు నష్టం: సీఎం రేవంత్ రెడ్డి