Foxconn:కర్నాటక రాజధాని బెంగళూరులో ఐఫోన్ల తయారీ ప్లాంట్ నెలకొల్పనుంది… ఫాక్స్కాన్ సంస్థ. 70 కోట్ల డాలర్లు… అంటే మన కరెన్సీలో 5,700 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో బెంగళూరు విమానాశ్రయానికి దగ్గర్లో ఈ ప్లాంట్ పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ధ్రువీకరించారు. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా ఏకంగా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా.
ప్రస్తుతం ఫాక్స్కాన్కు చైనాలోని ఝాంగ్ జౌలో అతి పెద్ద ప్లాంట్ ఉంది. ఇక్కడే అత్యధికంగా ఐఫోన్లు ఉత్పత్తి అవుతాయి. కొవిడ్ కారణంగా కార్మికులు అందుబాటులో లేక… అందులో భారీగా ఉత్పత్తి తగ్గిపోయింది. మరోవైపు వాషింగ్టన్-బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో… చైనా నుంచి ఉత్పత్తిని తరలించాలన్న ఉద్దేశంతో ఫాక్స్కాన్ ఉంది. ఇప్పటికే ఆ సంస్థకు తమిళనాడులో ప్లాంట్ ఉన్నా… అందులో చాలా తక్కువ సంఖ్యలో ఐఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. దాంతో భారత్లోనే మరో చోట ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం… కర్నాటక ఐటీ శాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణతో భేటీ అయి చర్చలు జరిపింది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు దగ్గర్లో 300 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలించిన ఆ బృందం… అక్కడే ప్లాంట్ పెట్టాలని ఫిక్సైంది. భారత్లో ఫాక్స్కాన్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తే… చైనా బయట ఆ సంస్థ పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇదే కానుంది.
బెంగళూరులో ఏర్పాటు చేయబోయే కొత్త ప్లాంట్లో ఐఫోన్ల తయారీతో పాటు మరికొన్ని యాపిల్ ఫోన్లను అసెంబుల్ చేయనుంది… ఫాక్స్కాన్. ప్లాంట్లోనే కొంత భాగాన్ని విద్యుత్ వాహనాల వ్యాపారానికి వినియోగించనుంది. మరోవైపు… టాటా గ్రూప్ కూడా దేశంలో ఐఫోన్ల తయారీ కోసం ఫాక్స్కాన్ సంస్థతో చర్చలు జరుపుతోంది. అవి ఓ కొలిక్కి రాకముందే… ఫాక్స్కాన్ సొంతంగా బెంగళూరు దగ్గర్లో ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది.