GHMC Council: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ(GHMC) పాలక మండలి పదవీ కాలం నేటితో ముగియనుంది. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) గెలుపు సాధించినా, 2021 ఫిబ్రవరి 11న మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. గడిచిన అయిదేళ్లలో పౌర, అత్యవసర సేవల నిర్వహణతో పాటు అభివృద్ది కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నా, పాలక మండలి పెద్దగా, నగర ప్రథమ పౌరురాలు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రత్యేక మార్కు అంటూ ఏమి లేదనే చెప్పవచ్చు. పాలక మండలి గడువు ముగింపునకు మూడు నెల ముందే అప్రమత్తమైన పాలక మండలి పెద్దలు, కార్పొరేటర్లు కనీసం చివరి రోజుల్లోనైనా తనకు సహకరించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఆ తర్వాత జరిగిన పలు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కార్పొరేటర్ల స్టడీ టూర్లు, లీజుల ఎక్స్ టెన్షన్, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన టేబుల్ ఐటమ్స్ పెట్టి, ఆమోదించుకున్నారు. ఇందులో భాగంగానే జోనల్ కమిషనర్లకు అడిషనల్ పవర్స్ అప్పగించేలా కమిషనర్ పై వత్తిడి కూడా చేశారు. అంతటితో ఆగకుండా ప్రతి పనికి సంబంధించిన టెండర్ల వ్యవహారం స్టాండింగ్ కమిటీ దృష్టి రావాల్సిందేనన్న నిర్ణయం తీసుకున్నారు. 2020 కరోనా సెకండ్ వేవ్ విపత్కర సమయంలో డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించింది. బంజారాహిల్స్ డివిజన్ ను బీఆర్ఎస్ కార్పొరేటర్ గా గెలిచిన గద్వాల్ విజయలక్ష్మి ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 11వ తేదీన మేయర్ గా బాధ్యతలు స్వీకరించి మేయర్ గా కొనసాగుతూ, నేటితో పదవీ కాలాన్నిపూర్తి చేసుకోనున్నారు. గతంలో ఏ పాలక మండలికి దక్కని అరుదైన ఘనత ఈ కౌన్సిల్ కు దక్కిందని చెప్పవచ్చు. అయిదేళ్లు అధికార గడువులో కౌన్సిల్ ఆరు వార్షిక బడ్జెట్ లకు ఆమోద ముద్ర వేయటం విశేషం.
జీహెచ్ఎంసీ మేయర్ గా విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పలు వివాదాలకు తెర దీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు మేయర్ కనీసం తన సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా కలుపుకుని పోవలేదని ఆమె సొంత పార్టీ కార్పొరేటర్లే బహిరంగంగా విమర్శలు చేశారు. కొన్ని సందర్భాల్లో తన సొంత పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ శ్రీలతను సైతం మేయర్ పక్కనబెట్టి విమర్శల పాలైన సందర్భాలున్నాయి. బీఆర్ఎస్ లో ఉన్నపుడు మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య ఒక రకమైన కోల్డ్ వారే నడిచింది. మొట్టమొదటి స్టాండింగ్ కమిటీ సభ్యులతో సైతం మేయర్ సమన్వయాన్ని సమకూర్చుకోలేదని కొందరు సభ్యులే బాహాటంగా వ్యాఖ్యానించారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు భవన నిర్మాణదారులను మేయర్ అనుచర వర్గం వేధింపులకు గురి చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. 2022లో బాగ్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై కుక్కల దాడి చేయటంతో ప్రదీప్ అనే చిన్నారి చనిపోయిన ఘటనపై కూడా మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని సరైన రీతిలో నడపటంతో తొలుత ఆమెలో కొంత కమాండింగ్ కొరవడినా, ఆ తర్వాత సమర్థవంతంగా కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తూ వచ్చారు. కానీ ప్రతి సమావేశంలో సభ్యుల ప్రశ్నలను దాటవేస్తూ వచ్చిన మేయర్ అధికారులను కాపాడుకునే ప్రయత్నం చేశారన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. ఇలా గడిచిన అయిదేళ్లలో మేయర్ అధ్యక్షతలోని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల్లో ఎక్కువ అర్థరహితమైనవేనన్న విమర్శలు లేకపోలేవు.
Also Read: Pen drives: పెన్డ్రైవ్కు ఆ రెండు రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? దీని వెనుకున్న అసలు కారణం ఇదే!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మొదటి సారిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన 2016 నుంచి ప్రస్తుత పాలక మండలిలో సభ్యులుగా కొనసాగుతున్నా కార్పొరేటర్లకు కూడా వార్షిక బడ్జెట్ లేకుండానే పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం గడువు ముగియనున్న కార్పొరేటర్లకు సైతం వార్షిక బడ్జెట్ అంటూ ఏమీ లేదు. ఒక్కో కార్పొరేటర్ కు రూ. 3 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలని పలు కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేర్లు డిమాండ్ చేసినా, గత గులాబీ, ప్రస్తుత సర్కారు కూడా పట్టించుకోలేదు. ప్రత్యేకంగా వార్షిక బడ్జెట్ అంటూ ఏమీ లేదని, దాన్ని కేవలం రూ. 3 కోట్లకే ఎందుకు పరిమితం చేయాలంటూ, కార్పొరేటర్లు తమ డివిజన్ కు అవసరమైన స్థాయిలో ప్రతిపాదనలు సమర్పిస్తే మంజూరీస్తామని అప్పటి సర్కారు స్పష్టం చేసింది.
ప్రస్తుత పాలక మండలి నవంబర్ 25న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కో కార్పొరేటర్ కు రూ. 2 కోట్లు ప్రత్యేక బడ్జెట్ గా రూ. 2 కోట్లను కౌన్సిల్ ప్రకటించింది. కానీ వీటిలో రూ. కోటి ప్రతిపాదనలను నేరుగా కార్పొరేటర్ సమర్పించుకునే అవకాశమిచ్చినా, మిగిలిన రూ. కోటికి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి మంజూరీ తీసుకోవాలన్న కొర్రీని పెట్టారు. ప్రస్తుతమున్న 144 మంది కార్పొరేటర్లలో సగం మంది కేవలం రూ. కోటికి మాత్రమే ప్రతిపాదనలను సమర్పించినట్లు, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అందుబాటులో లేరని కొందరు కార్పొరేటర్లు కౌన్సిలో గళం విన్పించినా, ఫలితం లేకుండా పోయింది.
నేటితో జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నా, వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశాల్లేవని తెల్సిందే. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 2 వేల 53 చదరపు కిలోమీటర్లకు విస్తరించటంతో, మున్ముందు ఈ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించి, వికేంద్రీకరణ చేయాలని సర్కారు భావిస్తున్నందున కార్పొరేషన్ల ఏర్పాటు, కొత్తగా ఏర్పడనున్న రెండు కార్పొరేషన్లలో మళ్లీ వార్డుల పునర్విభజన పూర్తి చేసి, రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు ఉన్న్తతాధికార వర్గాల సమాచారం. కార్పొరేషన్ల ఏర్పాటు, పునర్విభజన ప్రక్రియలు పూర్తి చేసేందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశామున్నందున మూడు కార్పొరేషన్లకు మే మాసంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
Also Read: Medchal News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహం.. భర్త ఇంటిముందు భార్య ధర్నా!