Iran War: ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఎందుకు విఫలం చెందాయి? రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేకపోవడంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారనున్నాయా? తమ డిమాండ్స్ను ఒప్పుకోలేదని ఇరాన్పై పూర్తి బాధ్యతను నెట్టేశారు జేడీవాన్స్. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందా? ఈ చర్చలు కేవలం ఒకరినొకరు భయ పెట్టుకోవడానికా? రాబోయే ప్రమాదానికి సంకేతమా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
పశ్చిమాసియా మళ్లీ యుద్ధం మేఘాలు మొదలు
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా-ఇరాన్ మధ్య ప్రయత్నాలు ఆదిలో విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా -ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. అయతే ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో 14 రోజులుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ముగిసిన వెంటనే మళ్లీ యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మోహరించిన నేపథ్యంలో ఇరాన్ తన క్షిపణులను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.
ఇస్లామాబాద్ చర్చలు విఫలం.. అమెరికా నిర్ణయం ఎటు?
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని దిగ్బంధించానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అది చేస్తే ఇరాన్ లొంగుతుందని అమెరికా భావన. అదే జరిగితే భారీ వార్కు దారి తీసే అవకాశం ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తే ఇరాన్ ఆ స్థాయిలో ప్రతిఘటించనుంది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలను టార్గెట్ గా చేసుకునే అవకాశం ఉంది.
అదేగనుక జరిగితే సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పవు. అంతేకాదు పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలకు ముప్పు పొంచి ఉంది. ఈ యుద్ధం కాస్త లెబనాన్, సిరియాలకు పాకే అవకాశం ఉంది. టెహ్రాన్కు మద్దతుగా హూతీలు, హెజ్బొల్లాలు తమ కార్యకలాపాలను తీవ్రతరం చేయడమేకాదు, హోర్మూజ్ జలసంధితోపాటు హౌతీలు మరొక జలసంధిని మూసి వేసే అవకాశం ఉంది.
ALSO READ: ఇస్లామాబాద్ శాంతి చర్చలు.. ఇరాన్ వెర్షన్ ఏంటి? చర్చల విఫలం వెనుక అదే కారణమా?
ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెల కొనే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఊహించని స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఫలితంగా ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసే అవకాశం ఉంది. పౌర అవసరాల కోసం యురేనియంను శుద్ధి చేస్తున్నట్లు చెప్పిన ఆ దేశం, రాబోయే పరిణామాలతో అణుబాంబు తయారీ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.